కలెక్టర్ హన్మంతు కె.జెండగే
ఆలేరు రూరల్, ఏప్రిల్ 14 : జిల్లాలో మొత్తం 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ హన్మంతు కె.జెండగే అన్నారు. ఆలేరు మార్కెట్ యార్డును ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 373 మంది రైతుల నుంచి 4వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేశామని, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, తేమ యంత్రాలు సరిపడా ఉన్నాయని తెలిపారు. ధాన్యం కాంటా వేయగానే మిల్లులకు తరలించాలని సెంటర్ ఇన్చార్జీలకు ఆదేశాలు ఇచ్చామని, అధికారులు పర్యవేక్షిస్తారని, కొనుగోలు కాగానే ఓపీఎంఎస్ నమోదు చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
ఆత్మకూరు(ఎం) : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సీరియల్ ప్రకారం మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ హన్మంతు కె.జెండగే అన్నారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని తాలు లేకుండా తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ పి.బెన్షాలోమ్, డీఆర్డీఓ కృష్ణన్, డీఏఓ సబిత, ఆర్డీఓ అమరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, సివిల్ సప్లయ్ డీఎం గోపీకృష్ణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా సహకార శాఖ ఇన్చార్జి రవికుమార్, డీపీఎం సునీల్రెడ్డి, ఏఓ సుజాత, ఏపీఎం పక్కీరయ్య పాల్గొన్నారు.