కొద్ది రోజులుగా తీవ్ర ఆటంకం కలిగించిన అకాల వర్షాలు తెరిపినివ్వడంతో ధాన్యం కొనుగోళ్లు చకచకా సాగుతున్నాయి. మూడు రోజుల నుంచి సజావుగా జరుగుతున్నాయి. గురువారం నాటికి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 6.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. సుమారు 85వేల మంది రైతుల నుంచి రూ.1,285 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు రూ.750 కోట్లు రైతులకు అందాయి.
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే అందులో 30శాతం నల్లగొండ, సూర్యాపేట జిల్లావే ఉండడం విశేషం. ఎక్కడికక్కడ కొనుగోలు చేసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపాదికన రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ట్రాక్టర్లు, లారీలను ధాన్యం రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతో జిల్లా కలెక్టర్లు వినయ్క్రిష్ణారెడ్డి, ఎస్.వెంకట్రావు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతోపాటు వివిధ విభాగాల జిల్లా, మండల స్థాయి అధికారులు కొనుగోళ్లపై దృష్టి సారించారు.
– నల్లగొండ ప్రతినిధి, మే11(నమస్తే తెలంగాణ)/సూర్యాపేట
నల్లగొండ ప్రతినిధి, మే11(నమస్తే తెలంగాణ)/ సూర్యాపేట : అకాల వర్షాలు విరామం ఇవ్వడంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతంగా సాగుతున్నది. రోజుకు 10 నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా రు. అయితే కొనుగోళ్లలో నల్లగొండ జిల్లా రాష్ర్టానికే దిక్సూచిగా నిలిచింది. ప్రతి సీజన్లో మాదిరిగానే ఈ సారి కూడా అన్ని జిల్లాల కంటే వేగంగా కొనుగోళ్లు జరుపుతూ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటికే 4.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రాష్ట్ర వాటాలో 25 శాతంతో ప్రత్యేకతను చాటుతుంది. వారం మొత్తం అకాల వర్షాలు ఇబ్బందులను కలుగజేయగా రెండ్రోజులుగా వాతావరణం పూర్తి అనుకూలంగా మారింది.
దాంతో కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి నేతృత్వంలో అధికార యంత్రా ంగం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. జిల్లాలో 346 కొనుగోలు కేంద్రాలు ఉండగా ప్రతి కొనుగోలు కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ నుంచి మొదలుకుని అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఇతర అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలోనే మకాం వేశా రు. గురువారం నాటికి నల్లగొండ జిల్లాలో మొత్తం 4.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. వరుసగా రెండోరోజూ 20 వేల మెట్రిక్ టన్నుల చొప్పున కాంటా పూర్తి చేశారు. ఇలాగే వర్షం ఆటంకం లేకుండా ఉంటే వారం రోజుల్లోనే కొనుగోళ్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముం దుకు సాగుతున్నారు. మొత్తం 57వేల మంది రైతుల నుంచి రూ.873 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. మంగళవారం నాటికి 38 వేల మంది రైతులకు రూ.590 కోట్ల వరకు చెల్లించారు. కాంటా వేసి న ధాన్యంలో ఇప్పటికే 4.15 లక్షల మెట్రిక్ టన్నులను రైస్మిల్లులకు తరలించారు.
ధాన్యం తరలింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించి అవసరమైనన్నీ లారీలను అందుబాటులోకి తెచ్చారు. ఇదే సమయంలో రైస్మిల్లుల వద్ద ధాన్యం దిగుమతులపై ప్రత్యేకాధికారులతో పర్యవేక్షిస్తున్నారు. గురువారం కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్రావు నల్లగొండ, నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో సమీక్షిస్తుండడంతో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా సాగుతున్నాయి. అకాల వర్షాలతో వచ్చిన ఆటంకాలు మినహాయిస్తే ప్రభుత్వపరంగా పకడ్బందీగా వ్యవహరిస్తుండడం తో సజావుగా ధాన్యం కొనుగోలు ముందుకు సాగుతున్నాయి. నల్లగొండ జిల్లాలో మరో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షణ, ఎమ్మెల్యేల సహకారం, కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి సారధ్యంలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుందని భాస్కర్రావు పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. యాసంగి 4,75, 632 ఎకరాల్లో వరి సాగు చేయగా ఆ ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 289 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ 178, పీఏసీఎస్ 111 కేంద్రాలు ఉన్నాయి. అయితే ఏప్రిల్ చివరి వారంతో పాటు మే మొదటివారం కూ డా అకాల వర్షాలతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం వరుణుడు కరుణించడంతో కలెక్టర్ వెంకట్రావ్ నుంచి మండల స్థాయి అధికారుల వరకు ధాన్యం సేకరణపైనే దృష్టి సారించారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. జిల్లాలో గడిచిన 15 రోజుల్లో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 28,067 మంది రైతుల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా వాటి విలువ సుమారు రూ.412 కోట్లు ఉంది.
ఇప్పటి వరకు దాదాపు 14,294 మంది రైతుల ఖాతాలో 185 కోట్లు జమ చేశారు. మిగితా రైతుల వివరాలను వెంట వెంటనే ట్యాబ్ ఎంట్రి చేయించి రోజుకు దాదాపు రూ. 40 కోట్ల వరకు జమ చేస్తు వస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 95 శాతం దాన్యం మిల్లులకు తరలించారు. ఇప్పటికే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా కొనుగోలు కేంద్రాల్లో మరో లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం ఉండవచ్చని అంచనా. వచ్చే వారం పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సేకరించిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు జరిగేలా కూడా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం నుంచి సంవృద్ధ్దిగా నిధులు అందుబాటులో ఉండడంతో ట్యాబ్ ఎంట్రీ పూర్తవ్వగానే రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. కేవలం సూర్యాపేట డివిజన్ పరిధిలోనే ధాన్యం అత్యధికంగా ఉండడంతో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాలతో ఈ 12 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి చకచకా సేకరణ పూర్తి చేస్తున్నారు.