యాదాద్రి భువనగిరి, మే 23 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జిల్లా ప్రజలను నిరాశపరిచింది అటు గుట్ట ఆలయ అభివృద్ధికి కానీ, ఇటు జనంపై కానీ ఎటువంటి వరాల జల్లులు కురిపించలేదు. దీంతో జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. వచ్చా మా..? శంకుస్థాపన చేశామా..? పోయామా..? అన్నట్లుగా సీఎం పర్యటన సాగింది. సీఎం నాలుగు సార్లు గుట్టకు వచ్చినా ఒరిగిందేమీ లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. గుట్టలో అనేక పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటికి నిధులు అవసరం. కానీ వాటి విషయమై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొత్త ప్రాజెక్టులను సైతం ఏవీ ప్రకటించలేదు. ఆలేరు ప్రజల చిరకాల వాంఛ అయిన రెవెన్యూ డివిజన్ ప్రస్తావనేలేదు. సాగు నీటి ప్రాజెక్టు నిధుల ఊసే లేదు. గత పర్యటన లో వలిగొండ మండలంలోని సంగెం భీమలింగం అభివృద్ధి పనులకు రూ. 2 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినా ఒక్క పైసా ఇవ్వలేదు. బస్వాపూర్ రిజర్వాయర్కు నిధులు, గంధమల్ల ప్రాజెక్టు, బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వలు, ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ కారిడార్, భువనగిరిలో డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు, భువనగిరి-చిట్యాల రోడ్డు విస్తరణ, రాచకొండ, కొలనుపాక భూదాన్పోచంపల్లి, భువనగిరి ఖిలా, యాదగిరిగుట్ట పర్యాటక ప్రాంతాభివృద్ధి తదితర ఎన్నో సమస్యలపై మాట్లాడతారని జనమంతా ఆశించినా ఆయన అసలేమీ మాట్లడకుండానే వెళ్లిపోయారు.