బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. అందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అనుముల సమీపంలో సభా స్థలంతోపాటు పార్కింగ్ ఇతర సౌకర్యాల కోసం విశాలమైన ప్రదేశాన్ని ఎంపిక చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు సభకు స్వచ్ఛందంగా తరలివచ్చే సంకేతాలు కనిపిస్తుండడంతో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సభా స్థలాన్ని, పార్కింగ్ ప్రదేశాలను ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్రెడ్డి పరిశీలించారు. సభకు మరో రెండ్రోజులే ఉండడంతో ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రానున్నారు. అదే రోజు ముందుగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ సభలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో హాలియాకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు హాలియా పట్టణం నుంచి పెద్దవూర రోడ్డులో అనుముల దాటాక విశాలమైన స్థలంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, చేపట్టాల్సిన పనులు తదితర అంశాలతో పాటు దేశ, రాష్ట్ర రాజకీయాల గురించి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మలి విడుత ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జ్లిలాలో నాలుగు చోట్ల పర్యటించనున్నారు. మంగళవారం హాలియా పర్యటన అనంతరం ఈ నెల 20న నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో, 21న సూర్యాపేట సభల్లో పాల్గొనేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. తొలి విడుతలో భువనగిరి, మునుగోడు, కోదాడ, తుంగుతుర్తి, ఆలేరు, హజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించారు. అన్ని చోట్లా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్రలను, బూటకపు హామీలపై ప్రజలకు విడమర్చి చెబుతున్నారు. నల్లగొండ జిల్లా అభివృద్ధిలో బీఆర్ఎస్ సర్కార్ పాత్ర ఏంటో విపులంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో హాలియాలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి పట్ల బీఆర్ఎస్కు ఉన్న ప్రణాళికలను ప్రజలకు వివరించనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
ప్రజా ఆశీర్వాద సభకు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అనుముల సమీపంలో ప్రభుత్వ ఐటీఐ కాలేజీకి ఎదురుగా 10 ఎకరాల స్థలాన్ని సభ కోసం ఎంపిక చేశారు. ఇప్పటికే స్థలాన్ని చదును చేయడంతోపాటు సభా వేదిక ఏర్పాట్లు షురూ చేశారు. దీంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా అన్ని వైపులా పార్కింగ్ ప్రదేశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్కింగ్ స్థలాలను కూడా చదును చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం సభా ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్రెడ్డి, పార్టీ నాయకులు పరిశీలించారు. సభా వేదిక, వీఐపీ, మీడియా, మహిళా గ్యాలరీలు, బారీకేడ్ తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు వేలాది మంది సిద్ధమవుతుండగా.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే నోముల భగత్ వెల్లడించారు. సాగర్ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి పట్ల తమ అభిమానాన్ని చాటాలని ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
హాలియా, నవంబర్ 11 : ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న హాలియాకు రానున్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశ్వీరాద బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. సభకు సుమారు లక్ష మంది వచ్చే అవకాశం ఉండగా.. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభతో సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరింతగా పుంజుకునే అవకాశం ఉన్నది. సభ కోసం పార్టీ నాయకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
హాలియా – దేవరకొండ ప్రధాన రహదారి వెంట అనుముల గ్రామంలో 10 ఎకరాల స్థలాన్ని జేసీబీలు, డోజర్లతో శుభ్రం చేస్తున్నారు. సభ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. సభ విజయవంతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వారి వెంట జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, అనుముల ఎంపీపీ సుమతీపురుషోత్తం, కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్నాయక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వడ్డె సతీశ్రెడ్డి, నాయకులు ఉన్నారు.