నల్లగొండ, నవంబర్ 24 : గతంలో భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా.. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు, నెలల తరబడి ఎదురుచూపులు తప్పేవి కావు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ తెచ్చాక సమూల మార్పులు వచ్చాయి. 10నిమిషాల్లో భూ క్రయ విక్రయాలు, మ్యుటేషన్ తాసీల్దార్ పరిధిలోనే పూర్తవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకొస్తే ధరణి తీసేసి భూమాత తెచ్చి పాత రెవెన్యూ వ్యవస్థను కొనసాగిస్తామనడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
ధరణి తీసేస్తే మళ్లీ వీఆర్ఓ నుంచి తాసీల్దార్ వరకు చేతులు తడపడం.. ఆఫీసుల చుట్టూ తిరగడం తప్పదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దయిన పహానీ వ్యవస్థ భూ మాత పోర్టల్తో మళ్లీ మనుగడలోకి వస్తే పాస్ పుస్తకాల్లో పట్టాదారు స్థానంలో ఒకరు, కబ్జాదారు స్థానంలో మరొకరు ఉంటారు. ఇందులోని 32 కాలమ్స్లో ఏంఏం రాస్తారో.. రాస్తే మళ్లీ పోలీస్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనా అని రైతులు జంకుతున్నారు. మ్యానువల్ పహానీ అమల్లో ఉన్నప్పుడు పైరవీకారులు, లంచగొండిదారులదే రాజ్యమైంది.
నాటి సాఫ్ట్వేర్పై సైతం పలు అనుమానాలు ఉన్నాయి.ప్రస్తుతం ధరణి పోర్టల్ పుణ్యమా అని భూముల గొడవలు పోయి ప్రశాంతంగా ఉంటున్న రైతులు మళ్లీ పాత పద్ధతే తెస్తామంటున్న కాంగ్రెస్ నాయకుల మాటలతో ఆందోళన చెందుతున్నారు. ధరణి తెచ్చి సమస్యలు పరిష్కరించిన బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఇచ్చి పోర్టల్ను కాపాడుకుంటామని రైతులు పేర్కొంటున్నారు.
సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చాక రైతుల కష్టాలు పూర్తిగా పోయాయి. కాంగ్రెస్ పాలనలో రైతులు భూమి రిజిస్ట్రేషన్కు రిజిస్ట్రేషన్ ఖర్చులే గాక మధ్యవర్తులకు లంచాలు ఇచ్చి చేయించుకునేది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ధరణి తేవడంతో ఖర్చులు తగ్గి రైతుల కష్టాలు తీరాయి. ధరణి పోర్టల్ వచ్చాక పైసా లంచం లేకుండా భూముల రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. మీసేవా కేంద్రంలో ధరణి పోర్టల్లో భూమికి ఉన్న విలువ ప్రకారం ఆన్లైన్లో పైసలు కట్టి మిగతా వారెవరికీ పైసలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. భూముల వివరాలు ఆన్లైన్లో ఉండడంతో రైతులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు సులువుగా అవుతున్నాయి. రైతుల మేలు కోరిన సీఎం కేసీఆర్ ధరణి వ్యవస్థను తెచ్చి రైతులందరికి ఇబ్బంది లేకుండా చేశారు. మా కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్ను కాదని ఇంకొకరికి అధికారం కట్టబెట్టే ప్రసక్తే లేదు.
– పురుషోత్తంరెడ్డి, వేములపల్లి
భూమి విలువ తెలిసినోడు కౌలుదారు చట్టం తెస్తానని మాట్లాడడు. 50ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నా. కాంగ్రెస్ పాలనలో పట్వారీలు పైసలు తీసుకుని భూమి ఒకరి పేరు నుంచి మరొకరి పేరు మీదకు మార్చేటోళు. ఎవరి దగ్గరైనా భూమి కొంటే పట్వారీల చుట్టూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. పట్వారీ చెప్పిన దళారి దగ్గరకి పోతే ఆయన డబ్బులు తీసుకుని ఆయన చెప్పిన టైంకు భూమి పట్టా చేయించేటోళ్లు. భూమి రేట్లో సగం దళారులకే పోయేది. కడుపున పుట్టిన పిల్లలకు పట్టా చేయాలన్నా పైసల మీద పైసలు తీసుకునేటోళ్లు. ఇయ్యాల ఆ పరిస్థితి లేదు.
మండలంలోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. తాసీల్దార్ అన్ని విషయాలు చెప్పి పట్టా చేసి పంపుతుండ్రు. అర్ద గంటలోనే మ్యుటేషన్లు, అమిట్మెంట్లు అన్ని అయిపోతుండే. కొడుకులకు, కోడండ్లకు, కూతుళ్లకు పట్టా చేయాలంటే తక్కువ పైసల్ అయితున్నయ్. కౌలుదారు చట్టం తెస్తే వాడి భూమి నాదేనని కేసులు పెడ్తే పెద్ద మనుషులు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాలే. మేము వేలు పెట్టి సంతకం పెడితే మా భూమి మాకు కనపడే ధరణినే మాకు కావాలి.
కాంగ్రెసోళ్లు ధరణి రద్దు చేసి రైతుల జీవితాలతో చెలగాటమాడాలని చూస్తుండ్రు. మళ్లీ దళారీ వ్యవస్థ తెచ్చి మమ్మల్ని దోపిడీ చేయాలని చూస్తున్నరు. సీఎం కేసీఆర్ సార్ ధరణి పోర్టల్ తెచ్చాన కాడి నుంచి ఎవరి భూమి వారి పేరున పదిలంగా ఉంది. భూ తగాదాలు తగ్గాయి. రిజిస్ట్రేషన్లకు రోజుల తరబడి అధికారుల చూట్టూ తిరిగే రోజులు పోయాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నాలా పర్మిషన్లైనా ఒక్కరోజులో వెంటనే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన సమాచారం మన ఫోన్ నంబర్కు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా భూ యజమానికి తెలవకుండా మరొకరి పేరు మీదకి మారే అవకాశమే లేదు. రైతు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ వారికి ఇష్టం లేనట్లుంది. వారికి అధికారం మీద తప్ప రైతులపై గానీ వ్యవసాయంపై గానీ అవగాహన లేదు. రైతులకేం కావాలో అన్నీ సమకూరుస్తున్న సీఎం కేసీఆర్ సార్కే మేము అండగా ఉంటాం.
– ధీరావత్ హతీరాం, నేన్యాతండా(గ్రా), మిర్యాలగూడ టౌన్
గతంలో ధరణి లేనప్పుడు భూ రికార్డులన్నీ అస్తవ్యస్తంగా మారి దళారులదే హవా నడిచేది. రికార్డుల్లో భూములు తారుమారు చేసేవారు. దీంతో రైతుల మధ్య భూతగాదాలు పెట్టి దోచుకునేవారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తేగా రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. సెంటు భూమి తేడా లేకుండా ఎవరు మార్చకుండా ధరణిలో భద్రంగా భూములు ఉన్నాయి, కాంగ్రెస్ నాయకులు మేము అధికారంలోకొస్తే భూమాత పోర్టల్ తెచ్చి పాత పద్ధతిన రికార్డులు యథావిధిగా ఉంచుతామంటున్నారు. మళ్లీ రైతులకు గొడవలు పెట్టినట్లు అవుతుంది. ప్రస్తుతం ఎంతో మంచిగా ఉన్న ధరణిని కొనసాగించేందుకు బీఆర్ఎస్కే అండగా ఉంటాం.
– గుర్రం శ్రీనివాస్రెడ్డి, తిప్పలమ్మగూడం(గ్రా), తిప్పర్తి
ధరణి పోర్టల్ను బంగా ళఖాతంలో పడేస్తామని పదే పదే చెప్తున్న కాంగ్రెసోళ్లను మొదలు ఈ ఎన్నికలో బొందపెడితే సరిపోద్ది. మాకు 32ఎకరాలు సాగు భూమి ఉంది. 22ఎకరలు కౌలుకు ఇస్తా. మిగిలినది నేనే సాగు చేస్తా. పాత పద్ధతిలో 36 కాలమ్లు తీసుకొచ్చి, కౌలు రైతులకు అగ్రిమెంట్ ఇస్తే , మరి రైతుబంధు ఎట్లా వస్తయ్.. ఎవరికిస్తరు. ఇలా స్పష్టత లేకుండా రైతులను ఇబ్బంది చేసే పనికి పూనుకుంటున్న కాంగ్రెస్ను తరిమికొడుతాం. కాంగ్రెసోళ్ల పాలనలో వీఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రతి పనికి పైసలిస్తేనే పనులు అయ్యేవి. మా భూమికి భద్రత లేకుండే. ధరణి పోర్టల్ వచ్చాక రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ అత్యంత సులభంగా, పారద్శకంగా మారింది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ అంతా తాసీల్దార్ కార్యాలయంలో జరుగుతుంటే రైతుగా ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటున్నాం. ధరణితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న సమయంలో దానికి తీసేస్తామని చెబుతున్న కాంగ్రెస్కు బరాబర్ ఓటేయం.
-యార్రమాద రాంరెడ్డి, పెద్దసూరారం(గ్రా), నల్లగొండ రూరల్