యాదాద్రి భువనగిరి, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామిని బుధవారం సీఎం కేసీఆర్తోపాటు ఆప్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ దర్శించుకున్నారు. దాదాపు గంటన్నరకు పైగా కొండపైనే గడిపారు. ఉదయం 11:15గంటలకు చేరుకున్న వారు 12:50 వరకు యాదగిరిగుట్టలోనే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం 10:30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా కాస్త ఆలస్యం అయ్యింది. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రెండు హెలికాప్టర్లలో బయల్దేరి ఉదయం 11:15గంటలకు యాదగిరిగుట్టకు చేరుకున్నారు. గోశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్లో నేరుగా ప్రెసిడెన్షియల్ సూట్కు వెళ్లారు. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా వివిధ కారణాలతో దర్శనానికి దూరంగా ఉన్నారు. వీరిని సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా ప్రెసిడెన్షియల్ సూట్ వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
సీఎంలు ఉదయం 11:37 గంటలకు గుట్టపైకి చేరుకోగా అక్కడి నుంచి ముందుగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. 11:45 గంటలకు ఆలయంలోకి వచ్చారు. అనంతరం ధ్వజస్తంభాన్ని మొక్కారు. 11:47 గంటలకు ఆలయ మూల విరాట్ స్వయంభూ శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి గర్భగుడిలోకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు ఏడు నిమిషాల పాటు గర్భగుడిలో పూజలు చేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన ముఖ్యమంత్రులకు ప్రధా న అర్చకులు, వేదపండితులు సంకల్పం చెప్పి, సువర్ణ పుష్పాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం అద్దాల మండపాన్ని సందర్శించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని తిలకించా రు. అనంతరం అర్చకులు అందజేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదే విధంగా స్వా మి వారి విగ్రహాలు, ఫొటోలు, జ్ఞాపికలను అందించి ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత మాఢ వీధుల్లోకి వెళ్లారు.
ముఖ్యమంత్రులంతా మధ్యాహ్నం 12.29 గంటలకు అనుబంధ ఆలయం శివాలయానికి వెళ్లారు. అక్కడ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయంలో ఉన్న ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారిలో పూజలో పాల్గొన్నారు. వేదపండితులు, అర్చకులు వారికి ఆశీర్వచనంతోపాటు తీర్థప్రసాదాలు అందించారు. 12.34గంటలకు శివాలయం నుంచి బయటకు వచ్చారు. 12.35గంటలకు కాన్వాయ్లో తిరిగి ప్రెసిడెన్షియల్ సూట్కు వెళ్లారు. అక్కడున్న పినరయి విజయన్, డి. రాజాను వెంటబెట్టుకొని హెలిప్యాడ్కు చేరుకున్నారు. 12.50గంటలకు రెండు హెలికాప్టర్లలో యాదగిరిగుట్ట నుంచి ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు బయల్దేరి వెళ్లారు.
నలుగురు ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఘటనలూ చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1,600మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇందులో డీసీపీ, ఏసీపీ, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం గుండా గుట్టపైకి చేరుకోవడంలో ఆటంకాలు కలుగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ముందుగానే ఆయా మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్ స్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ప్రశాంతంగా సీఎంల పర్యటన ముగియంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
సీఎం కేసీఆర్తోపాటు ముఖ్యమంత్రులకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి కుంకుమ బొట్టు పెట్టి ఆహ్వానించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్, ఆర్డీఓ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రుల వెంట రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోశ్కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు ఉన్నారు.
యాదగిరిగుట్ట పునర్నిర్మాణానికి స్వయంగా నడుంబిగించిన సీఎం కేసీఆర్ ఆలయం గురించి ముఖ్యమంత్రులకు వివరించారు. ఆలయ స్థలపురాణం, చరిత్ర, ప్రాశస్త్య్రం గురించి తెలిపారు. గతంలో ఆలయంలో ఉన్న ఫొటోలు, ప్రస్తుతం పునర్నిర్మాణం తర్వాత తీసిన ఫొటోలను సీఎంలు, మాజీ సీఎంకు తెలియజేశారు. పునర్నిర్మాణం జరిగిన తీరును చెప్పారు. కృష్ణశిలలతో ఆలయాన్ని నిర్మించిన వైనాన్ని వివరించారు. గతంలో యాదగిరి గుట్టపై అర ఎకరం స్థలం మాత్రమే ఉండేదని, ఇప్పుడు దాన్ని నాలుగు ఎకరాలకు విస్తరించామని విషదీకరించారు. సిమెంట్ లేకుండా పూర్తిగా కృష్ణ శిలలతో, ఆలయానికి కావాల్సిన ఇతర రాళ్లను విదేశాల నుంచి తెప్పించామన్నారు. వివిధ రాష్ర్టాల్లో నిష్ణాతులైన స్తపతులను రప్పించి.. ఆలయాన్ని పునర్నిర్మించామని తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ కాంప్లెక్స్ నిర్మించామని, ఎస్కలేటర్లు, లిఫ్ట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ తర్వాత విజిటర్స్ బుక్లో ఆలయ గొప్పతనం గురించి అతిథులు తమ అభిప్రాయాన్ని నమోదు చేశారు. అనంతరం అధికారులు, అర్చకులతో ప్రత్యేకంగా గ్రూప్ ఫొటో దిగారు.
11.15 : యాదగిరిగుట్టకు చేరుకున్న రెండు హెలికాప్టర్లు
11.19 : స్వాగతం పలికిన అధికారులు, నేతలు
11.23 : హెలిప్యాడ్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్కు కాన్వాయ్ ప్రారంభం
11.33 : ప్రెసిడిన్షియల్ సూట్కు చేరుకున్న సీఎంలు, ఇతర నేతలు
11.37 : యాదగిరిగుట్ట కొండపైకి వచ్చిన అగ్రనేతలు
11.39 : ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం
11.42 : ఆంజనేయ స్వామి దర్శనం
11.45 : గర్భాలయంలోకి వెళ్లిన ముఖ్యమంత్రులు
11.47 : గర్భగుడిలో ప్రత్యేక పూజలు
11.54 : గర్భాలయం నుంచి బయటకు వచ్చిన సీఎంలు
11.57 : ముఖ్యమంత్రులకు ఆశీర్వచనాలు
12.06 : తీర్థ ప్రసాదాల అందజేత
12.09 : మాఢ విధుల్లో పరిశీలన
12.29 : శివాలయంలో దర్శనానికి పయనం
12.30 : పూర్ణకుంభంతో స్వాగతం
12.32 : ధ్వజంస్తంభం మొక్కిన సీఎం కేసీఆర్
12.34 : శివాలయం నుంచి బయటకు..
12.35 : కాన్వాయ్లో గుట్ట నుంచి కిందికి దిగిన సీఎంలు
12.38 : ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకున్న అగ్రనేతలు
12.50 : హెలిప్యాడ్ నుంచి ఖమ్మం బయల్దేరిన ముఖ్యమంత్రులు