యాదగిరిగుట్ట, అక్టోబర్ 28 : సమైక్య పాలనలో ఆలేరు పరిస్థితి కన్నీటిగాథ లాంటిది. చుక్క నీరు లేక బీడువారిని భూములు దర్శనమిచ్చేవి. చదువుకు దూరంగా, రోగాలకు చేరువగా అన్న పరిస్థితి ఉండేది. 65 ఏండ్ల కాంగ్రెస్ పాలనతో నిరాధారణకు గురైన ఆలేరు స్వరాష్ట్రంలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనతో ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారాయి. కలలోనైనా వస్తాయా అనుకున్న కాళేశ్వరం జలాలు నాలుగేండ్లుగా రైతన్న కాళ్లను కడుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన చారిత్రాత్మక పథకాలతో గతంతో పొలిస్తే వందరెట్ల అభివృద్ధి కళ్లకు కట్టిన్నట్టుగా కనిపిస్తున్నది.
మిషన్ కాకతీయ పథకంతో చెరువులు పునరుజ్జీవం పోసుకుని నిండుకుండలను తలపిస్తున్నాయి. చెక్డ్యామ్లు, వంతెనలు, తళతళ మెరిసే రోడ్లు, రైతు వేదికలు, చింతలు తీరేలా వంతెనలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు ఆలేరు చెంతకు చేరాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నాయి. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కులవృత్తిదారులకు పింఛన్లు, ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో ప్రజల కండ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. నూతన గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటులో ప్రజల వద్దకే పాలన వచ్చింది. కేవలం తొమ్మిదిన్నరేండ్లలో రూ. 5,500 కోట్లతో ఆలేరు నియోజవర్గం అన్నిరంగాల అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకంతో నియోజకవర్గంలోని 579 చెరువులు జలకళ సంతరించుకున్నాయి. పూడికతీత, కట్టల పటిష్టత, కంపచెట్ల తొలగింపు, ఫీడర్ చానళ్ల పునరుద్ధరణతో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. మూడు విడుతల్లో 579 చెరువులు, కుంటల ఆధునీకరణకు రూ.112.35 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. దాంతో గతంతో పొలిస్తే సాగు విస్తీర్ణం పెరిగింది. నియోజకవర్గంలో ఈ వానకాలం సీజన్లో 1,50,195 ఎకరాల విస్తీర్ణం సాగులోకి వచ్చింది. యాదగిరిగుట్ట మండలంమల్లాపురం, సైదాపురం చెరువులు, యాదగిరిగుట్ట పట్టణంలోని గండిచెరువును రూ.6.77 కోట్లతో మినీ ట్యాంక్బండ్లుగా ఆధునీకరించింది.
నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. 8 మండలాలు, 2 మున్సిపాలిటీలు కలిపి 324 ఆవాస గ్రామాల్లోని 74,306 ఇండ్లకు నల్లా నీళ్లు వస్తున్నాయి. భగీరథ పథకం కింద ప్రస్తుతం ఉన్న 277 ట్యాంక్లకు అదనంగా మరో 216 ట్యాంక్లను కొత్తగా నిర్మించారు. 1,022.6 కిలోమీటర్ల మేర గ్రిడ్ పైప్లైన్ వేసి ప్రతి గ్రామానికి శుద్ధి చేసిన గోదావరి, కృష్ణా జలాలు అందిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.7,992.11 లక్షలు ఖర్చు చేసింది.
రూ.279.34 కోట్లతో పల్లెల్లో నూతన బీటీ రోడ్లతోపాటు బీటీ రెన్యూవల్, అంతర్గత, సీసీ రోడ్లు పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రూ.76.33 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా కమ్యూనిటీ భవనాలు, అశురఖానాలు, నూతన పంచాయతీ భనవనాలు, పాఠశాలల్లో అదనపు గదులు, విద్యుత్ సబ్స్టేషన్లు, స్త్రీ శక్తి భవనాలు పూర్తయ్యి వినియోగంలోకి వచ్చాయి. తాజాగా మరో రూ. 20 కోట్లతో నూతనంగా కమ్యూనిటీ భవనాలు, బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టగా దాదాపు పూర్తికావొచ్చాయి.
నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలన్న లక్ష్యంతో మారుమూల గ్రామాల్లోనూ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారు. 2017లో ఆలేరులో గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఈ ఏడాది ఆలేరు పట్టణంలో మైనార్టీ గురుకుల పాఠశాలలో సుమారు 350 మంది విద్యార్థినులు, మోటకొండూర్లోని పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 640మంది, బొమ్మలరామారం మండలం చీకటిమామిడిలో పూలే బీసీ బాలుర గురుకల పాఠశాలలో 480 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటితోపాటు యాదగిరిగుట్టలో పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ కళాశాలలు, ఆలేరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అందుబాటులోకి రావడంతో ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువు చేరువైంది. మన ఊరు-మన బడి కింద రూ.11.71 కోట్లతో 106 ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా పరిధిలో ఒక్కటే మున్సిపాలిటీ ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో 2018లో యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలుగా మారి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో రూ.21.01 కోట్లతో, ఆలేరు మున్సిపాలిటీలో రూ.26.32 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అంతర్గతరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, ఒక్కో మున్సిపాలిటీకి ఇంటిగ్రేటెడ్ మారెట్లు నిర్మిస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 2 మున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిలెట్లు, పట్టణ ప్రకృతి వనాలు, పార్కులు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలో ప్రవహిస్తున్న బుక్లేర్, చొల్లేరు, బిక్కేరు వాగులతోపాటు ఆలేరు పెద్దవాగు, పెద్దకందుకూరు, శామీర్పేట వాగుల్లో రూ.13.85 కోట్లతో 23 చెక్డ్యామ్లు నిర్మించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎం)లో రూ.4 కోట్లతో చెక్డ్యామ్తో కూడిన వంతెన, గుండాల మండలం సుద్దాలలో ని బిక్కేరువాగుపై రూ.14కోట్లతో చెక్డ్యామ్తో కూడిన పెద్ద వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నిర్మాణాలతో పల్లెలు జలకళ సంతరించుకున్నాయి. తాజాగా మరో 11చెక్డ్యామ్ల నిర్మాణానికి రూ.29.65 కోట్ల నిధులు మంజూరుకాగా పనులు పురోగతిలో ఉన్నాయి.
కరోనా సమయంలోనూ పేదల సంక్షేమం ఆగలేదు. ప్రతి పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా సాగింది. ప్రతి పీహెచ్సీ, సీహెచ్సీలో వైద్య పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం, శుక్రవారం గర్భవతులకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు, ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. సీబీపీ, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, హెచ్ఐవీ, స్పూటం ఫర్ ఏఎఫ్బీతోపాటు వివిధ రకాల హోర్మోన్ పరీక్షల శాంపిళ్లు సేకరించి జిల్లా కేంద్రంలో పరీక్షలు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.2.60 కోట్లతో 13 పల్లె దవాఖానలకు పక్కా భవనాలు నిర్మించారు. మోటకొండూర్ మండల కేంద్రంలో పీహెచ్సీ 24 గంటల వైద్య సేవలు అందిస్తున్నది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సొంత నిధులతో ఆలేరు పట్టణంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గత మూడున్నరేండ్లుగా 100 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నారు.
యాదగిరిగుట్ట ఆలయం ఇల వైకుంఠపురంగా రూపుదిద్దుకున్నది. సీఎం కేసీఆర్ చొరవతో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.1,300 కోట్లు వెచ్చించి పునర్నిర్మించారు. 2.5 లక్షల టన్నుల కృష్ణశిలలను వినియోగించి ఆలయాన్ని ముకుటాయమానంగా తీర్చిదిద్దారు.
కొత్తగా ఒక మండలం..
పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ జిల్లా, మండలాలు, గ్రామ పంచాయతీల పునర్విభజన చేపట్టారు. నియోజకవర్గంలో యాదగిరిగుట్ట, ఆలేరు, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాల్లోని 13 గ్రామాలను కలుపుతూ మోటకొండూర్ను కొత్త మండలంగా ఏర్పాటు చేశారు. అలాగే 8 మండలాల్లోని 39 మారుమూల పల్లెలు, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారు.
ప్రభుత్వం యాదగిరిగుట్టకు వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 16న కళాశాల నిర్మాణానికి రూ.183 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులిచ్చింది. కాలేజీ నిర్మాణానికి యాదగిరిగుట్టలోనే మూడు స్థలాలను చూపిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. టెండర్ ప్రక్రియ పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా 20 ఎకరాల్లో అద్భుతంగా కాలేజీని నిర్మించనున్నారు. అలాగే నియోజకవర్గంలోని తుర్కపల్లిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయింది. తుర్కపల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 72లో 93.21 ఎకరాల భూసేకరణ చేశారు.