మిర్యాలగూడ/హాలియా, జూన్ 5 : సమైక్య పాలనలో అరిగోస పడ్డ విద్యుత్ రంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచలంచెలుగా పెంచి తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశానికే ఆదర్శమని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ, హాలియా పట్టణాల్లో వేర్వేరుగా జరిగిన విద్యుత్ ప్రగతి సభలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో పరిశ్రమలు మూతపడేవని, ఉదయం మూడు గంటలు, రాత్రి నాలుగు గంటల కరెంట్తో పంటలు ఎండిపోయేవని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశంలో ప్రతిపక్షాల నాయకులు శాసనసభకు ఎండిపోయిన పంటలను తెచ్చి రైతులు దయనీయ స్థితిని ప్రభుత్వానికి వివరించే వారని గుర్తుచేశారు. 2014 ముందు 24 గంటల కరెంట్ ఉంటే వార్త, నేడు 24 గంటల్లో ఒక్క నిమిషం కరెంట్ పోయినా అది వార్త అయ్యిందన్నారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతోపాటు దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. 2021-22లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2,126 యూనిట్లు కాగా, దేశ తలసరి వినియోగం1,255 యూనిట్లు అని పేర్కొన్నారు. ఇది దేశ తలసరి వినియోగం కంటే 69.40 శాతం ఎక్కువని అన్నారు. 2014కు ముందు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 1.11 కోట్లు కాగా, 2023 మే 1 నాటికి 7 కోట్లకు చేరిందని తెలిపారు. గతంలో రైతులు రాత్రిపూట పొలాల వద్దకు వెళ్లి పాము కాటుకు, కరెంటు షాక్కు గురై మృత్యువాత పడ్డారనే విషయాన్ని గ్రహించి వాటిని నివారించేందుకే సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తున్నారని చెప్పారు.
2014 తర్వాత ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు రూ.18,874 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. పల్లె ప్రగతి ద్వారా రూ.506 కోట్లు, పట్టణ ప్రగతి ద్వారా రూ.249 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక 1,062 కొత్త 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు, 3.89 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ,1.83 లక్షల కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఏర్పాటు చేసి రైతులకు, గృహ వినియోగదారులకు నాణ్యమైన 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటు పడుతున్న మన సీఎం కేసీఆర్కు ప్రజలంతా అండగా నిలువాలని కోరారు. ఆయా సమావేశాల్లో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా, మిర్యాలగూడ ట్రాన్స్కో డీఈ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ చెన్నయ్య, ట్రాన్స్కో ఎస్ఈ చంద్రమోహన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మోసిన్అలీ, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, గౌరు శ్రీనివాస్, వెంకటరమణచౌదరి, మారం శ్రీనివాస్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రత్యేకాధికారి రాజ్కుమార్, నల్లగొండ జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, ఎంపీపీలు బొల్లం జయమ్మ, మంచుకంటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశ్వర్లు, మర్ల చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు వెంపటి పార్వతమ్మాశంకరయ్య, కర్ణ అనూషారెడ్డి, విద్యుత్ శాఖ ఏడీఈ జ్యోతికుమార్, ఏఈలు వెంకటేశ్వర్లు, బాలూనాయక్, దాసయ్య, బీఆర్ఎస్ ఆయా మండల శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు.
24 గంటల విద్యుత్తో సాగు విస్తీర్ణం పెరిగింది
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విద్యుత్ విధానంతోనే రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం పెరిగిందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక నియోజకవర్గంలో లోఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం ఇప్పటి వరకు 467 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తో సాగు విస్తీర్ణంతోపాటు పంట దిగుబడి కూడా పెరిగిందన్నారు. గత ఏడాది యాసంగిలో 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ఈ ఏడాది 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన పటిష్ట విద్యుత్ విధానంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల నోర్లు మూతపడ్డాయని పేర్కొన్నారు. అనంతరం నలుగురు విద్యుత్ లైన్మెన్లను ఎమ్మెల్యే భగత్ సన్మానించారు. విద్యుత్ షాక్తో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు.
అన్నదాతకు అండగా నిలిచింది తెలంగాణ సర్కారే
దేశంలో అన్నదాతకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించి అండగా నిలిచిన సర్కార్ తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గతంలో ఐదారు గంటల కరెంట్ మాత్రమే వ్యవసాయానికి సరఫరా చేసేవారని, దాంతో పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారని పేర్కొన్నారు. 2014లో స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత సీఎం కేసీఆర్ దూరదృష్టితో విద్యుత్ ఉత్పత్తి సామర్థాన్యి పెంచి రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించారని, అదేవిధంగా పంటల పెట్టుబడి కోసం ఎకరాకు రూ.10 వేలు, రైతుబీమా అందించి అందుకున్న మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. లో ఓల్టేజీ సమస్య లేకుండా విద్యుత్ సబ్స్టేషన్లను సరిపడా నిర్మించి వ్యవసాయరంగానికి నాణ్యమైన కరెంట్ను అందించడంతో నేడు రైతులు పంటలు పుష్కలంగా పండి రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్కు రైతులు అండగా నిలువాలని కోరారు.
స్వరాష్ట్రంలోనే విద్యుత్ ఉద్యోగులకు మేలు జరిగింది
తెలంగాణ రాష్ట్రం వచ్చా విద్యుత్ ఉద్యోగులకు ఎంతో మేలు జరిగిందని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ అన్నారు. సీమాంధ్రుల పాలనలో విద్యుత్ ఉద్యోగులకు చాలీచాలని వేతనాలు ఉండేవని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విద్యుత్ ఉద్యోగుల వేతనాలు బాగా పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్ పాలనకు అన్ని వర్గాల మద్దతు ఉంటుంది అని అన్నారు.