ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బాంధవుడని, రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సమన్యాయంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో గురువారం బీసీ వృత్తిదారులకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. నకిరేకల్,
కేతేపల్లి, కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాలకు చెందిన 300 మంది లబ్ధిదారులకు రూ.3కోట్ల విలువైన చెక్కును స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల మాట్లాడుతూ గతంలో రుణం కావాలంటే బ్యాంకులు, అధికారుల చుట్టూ
చెప్పులరిగేలా తిరిగేవాళ్లమని, ఇప్పుడు సీఎం కేసీఆర్ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నారని పేర్కొన్నారు. సర్కారు సాయాన్ని సద్వినియోగం చేసుకుని వృత్తిదారులు ఆర్ధికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు.
– నకిరేకల్, ఆగస్టు 17
నకిరేకల్, ఆగస్టు 17 : దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీసీ బాంధవుడు సీఎం కేసీఆర్ అ, అందులో భాగంగానే బీసీ చేతి వృత్తిదారులకు రూ.లక్ష పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. నకిరేకల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం నియోజకవర్గ బీసీ వృత్తిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాలకు చెందిన 300 మందికి రూ.3 కోట్ల విలువైన చెక్కులను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల మాట్లాడుతూ.. బలహీనవర్గాలకు ఇచ్చే రూ.లక్ష తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని, వడ్డీ ఉండదని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో బీసీ, ఎస్సీ, మైనార్టీ, రెడ్లు, కమ్మ, బ్రాహ్మణ, వెలమలను ముందుకు తీసుకెళ్తున్న మహానాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
గత ప్రభుత్వాలు దళితులను ఇబ్బంది పెట్టాయని, స్వరాష్ట్రంలో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందజేసిన దళిత దేవుడు సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి లాంటి చేతి వృత్తుదారులకు రూ.లక్ష చొప్పున నియోజకవర్గానికి 300 మందికి అందించేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ డబ్బుతో చిరు వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. బీసీలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి దేశంలోనే సీఎం కేసీఆర్ ఒక్కరేనని, ఎక్కడో చేపలు పట్టుకునే కుటుంబానికి చెందిన బండ ప్రకాశ్ను ఎంపీగా చేసింది నిజం కాదా? అని అన్నారు. పార్లమెంటులో బీఆర్ఎస్ నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో ముగ్గురం బీసీలకు చెందిన వారిమే ఉన్నట్లు తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఆయన ఆశయాలకు అనుగుణంగా బలహీనవర్గాలకు చెందిన పిల్లలు కూడా కలెక్టర్లు, ఎస్పీలు, యాక్టర్లు, వ్యాపారవేత్తలు కావాలని ఆలోచన చేసిన బీసీ బాంధవుడు సీఎం కేసీఆర్ అన్నారు. నకిరేకల్ నుంచి మూడోసారి చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా గెలువబోతున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యా మాట్లాడుతూ.. బీసీ కులవృత్తులను ప్రోత్సహించింది ఎన్టీఆర్ అయితే, బీసీ కులాలకు రూ.లక్ష చేయూత అందిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ బంధుకు 6 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇది ఒక్క రోజు కార్యక్రమం కాదని, నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి నెలా 300 మందికి రూ.లక్ష చెక్కులను ప్రభుత్వం అందజేస్తుందని భరోసానిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే అధికారంలో ఉన్న పార్టీనే మళ్లీ ఆదరించాలని, మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు.
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. బీసీ చేతివృత్తిదారులకు బ్యాంకు లింకేజీ లేకుండా 100 శాతం సబ్సిడీతో లక్ష రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. వాటిని సద్వినియోం చేసుకొని చిరు వ్యాపారాలు, చేతివృత్తులు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, బొప్పని స్వర్ణలతాసురేశ్, బలరాం, ఎంపీపీలు కొలను సునీత, కన్నెబోయిన జ్యోతీబలరాం, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నవీన్రావు, వెంకట్రెడ్డి, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.