సూర్యాపేట, జూలై 24 (నమస్తే తెలంగాణ) : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దీంతో తాతలు, తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో క్యాబినెట్ మే నెలలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం రెగ్యులరైజ్ చేస్తూ జీఓ విడుదలైంది. ప్రస్తుతం వీఆర్ఏలకు రూ.10,500ల వేతనం అందుతుండగా ఇక మీదట వారి విద్యార్హతలను బట్టి ఇచ్చే ఉద్యోగాలకు రూ.19 వేల నుంచి 72,850లు అందబోతున్నది. సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్న 448 కుటుంబాలకు లబ్ధ్ది చేకూరుతుండడంతో వారంతా హర్షాతి రేకాలు వ్యక్తం చేస్తున్నారు.
భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం వాటి నిర్వహణలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రికార్డులన్నీ డిజిటలైజ్ కావడంతో గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దయింది. దాంతో గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏలు) అవసరం లేకుండా పోయింది. కొంత కాలంగా వీఆర్ఏలు తమ భవితవ్యం ఎలా ఉంటుందో అనే ఆందోళనతో నిరసనలు కూడా చేపట్టిన విషయం విధితమే. అయితే సీఎం కేసీఆర్ దీనిపై పలు మార్లు మంత్రి వర్గ సమావేశాల్లో సమీక్షలు చేసి వీఆర్ఏలను రెగ్యులరైజేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటూ విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసి వీఆర్ఏలను వివిధ శాఖల్లో నియమించేలా చర్యలు చేపట్టారు.
విద్యార్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, లాస్ట్ గ్రేడ్ సర్వీసు పోస్టులను వీఆర్ఏలకు కేటాయిస్తారు. 10వ తరగతి పాస్ అయిన వారికి రూ. 19వేల నుంచి రూ.58,850 వేతనం అందనుండగా ఇంటర్ పూర్తయిన వారికి రూ.22,240ల నుంచి 67,300లు, అలాగే డిగ్రీ, ఆపైన విద్యార్హతలు ఉన్న వారికి రూ.24,280ల నుంచి 72,850ల వరకు వేతనం అందనుంది. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా చేపడుతూ జీఓ జారీ చేయడం పట్ల వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయా యి. దాంతో సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్, గరిడేపల్లి,చింతలపాలెం తిరుమలగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో చిట్యాల,నల్లగొండ, నిడమ నూ రు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, రాజాపేటలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 651 మందికి లబ్ధి
యాదగిరిగుట్ట : వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో జిల్లాలో 651 మందికి లబ్ధి చేకూరనుంది. దాంతో వారందరికీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుభాకాంక్షలు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వీరిలో 160 మంది వయస్సు పైబడి ఉన్నవారి వారసులకు అవకాశం కల్పిస్తారని, మిగతా 491 మందిలో అర్హతల ప్రకారం వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధ్దీకరణ చేసినందుకు సీఎం చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
నల్లగొండ జిల్లాలో 798 మందికి లబ్ధి
నల్లగొండ : వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం జీఓ నంబర్ 81ను విడుదల చేసింది.దాంతో నల్లగొండ జిల్లాలో 798 మందికి లబ్ధి చేకూర నుంది. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతురని అన్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
ముఖ్యమంత్రి కేసీఆర్కు మేమంతా రుణపడి ఉంటాం. గతంలో వీఆర్వో వ్యవస్ధను రద్దు చేసి వేరే ఇతర శాఖల్లోకి మార్చారు. మమ్మల్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తారేమోనని భయం వేసింది. మా దుస్థితిని అర్ధం చేసుకోని వేరే శాఖల్లోకి మార్చడం ఎంతో సంతోషంగా ఉంది. 32 యేండ్లుగా చిల్లేపల్లి వీఆర్ఏగా పని విధులు నిర్వహిస్తున్నా. రూ. 720 జీతం ఉన్నప్పటి నుంచి పని చేస్తున్నా. రాష్ట్ర ఏర్పడిన తర్వాత మా వేతనం పెరిగింది. ప్రసుత్తం రూ. 10,500 వస్తుంది.గతంలో చాలీ చాలని వేతనంతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు వేతనం ఎక్కువగా రావడంతో సంతోషంగా జీవిస్తాం.
– షేక్. సైదులు, వీఆర్ఏ సంఘం నేరేడుచర్ల మండల ఉపాధ్యక్షుడు
పే స్కేల్ ఇవ్వడం గొప్ప విషయం
తాతలు తండ్రుల నాటి నుంచి గ్రామ సహాయకులుగా పనిచేసిన మమల్ని ఏ ప్రభుత్వాలు గుర్తించలేదు. సీఎం కేసీఆర్ మా శ్రమను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ ఇవ్వడం గొప్ప విషయం. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. 11యేండ్లుగా వీఆర్ఏగా పనిచేస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తుందని కలలో కూడ ఊహించ లేదు.
– గణపతి, వీఆర్ఏ, తిరుమలగిరి