హాలియా, ఆగస్టు 6 : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏడు పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దాంతో హుజూర్నగర్లో ఐదు, ఆలేరులో ఒకటి, నాగార్జునసాగర్లో ఒక పంచాయతీ కొత్తగా ఏర్పాటయ్యాయి. సాగర్ నియోజకవర్గంలో పెద్దవూర మండలం పూల్యతండాను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసింది. దాంతో పూల్యతండాతో పాటు దాని పరిధిలోని మల్లేవానికుంట గ్రామంలో ప్రజలు సంబురాలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంచుకొన్నారు. ఇప్పటి వరకు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఊరబావితండా, బెట్టలతండా, మల్లేవానికుంట, పూల్యతండా ఉండేవి. అయితే ఒకే గ్రామ పంచాయతీలో ఎక్కువ గ్రామాలు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నీమానాయక్ తండా నుంచి తమను వేరువేయాలని పూల్యతండా, మల్లేవానికుంట తండా గ్రామస్తులు అనేకసార్లు ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. దాంతో ఎమ్మెల్యే భగత్ కుమార్ విషయాన్ని సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పూల్యతండా, మల్లేవానికుంట తండాలను కలపి కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పా టు చేసింది. దాంతో మండలంలో గ్రామ పంచాయతీల సంఖ్య 28కి పెరిగింది.
గ్రామ పంచాయతీగా సాయిగూడెం
యాదగిరిగుట్ట/ఆలేరు : ఆలేరు మున్సిపాలిటీలో విలీనం చేసిన సాయిగూడెం తిరిగి గ్రామ పంచాయతీగా అవతరించింది. దాంతో 2018లో నూతన మున్సిపాలిటీల ఏర్పాటులో విలీనమైన సాయిగూడెం తిరిగి గ్రామ పంచాయతీగా కొనసాగనున్నది. మున్సిపాలిటీ నుంచి సాయిగూడెం గ్రామాన్ని తొలగించి, తిరిగి గ్రామ పంచాయతీగా కొనసాగించే బిల్లుకు అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపింది. గ్రామ ప్రజల కోరిక మేరకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మంత్రి కేటీఆర్కు విన్నవించగా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. గతంలో ఆలేరు గ్రామ పంచాయతీలో ఉన్న సాయిగూడేన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బిల్లు ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. 250 గృహాలు 900 జనాభాతో సుమారు 10 కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన సాయిగూడెం వచ్చే ఎన్నికల లోగా నూతన గ్రామ పంచాయతీగా మారనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ జీఓ త్వరలో వెలువడనున్నది.
హుజూర్నగర్ నియోజకవకర్గంలో ఐదు పంచాయతీలు
నేరేడుచర్ల, ఆగస్టు 6 : హుజూర్నగర్ నియోజకవర్గంలో ఐదు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదివారం జీఓ విడుదల చేసింది. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక చొరవతో నేరేడుచర్ల, గరిడేపల్లి, మేళ్లచెర్వు మండలాల్లోని జానల్దిన్నె, లాల్ లక్ష్మీపురం, జగ్గు తండా, దుబ్బ తండా, కొండయ్యగూడెం గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం జీఓ విడుదల చేశారు. నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఇప్పటికే 141 గ్రామ పంచాయతీలు ఉండగా నూతనంగా ఏర్పడనున్న ఐదు గ్రామ పంచాయతీలతో కలిపి 146కు చేరనుంది. నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని లాల్ లక్ష్మీపురం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది.
వైకుంఠాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని జానల్దిన్నె, గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ పరిధిలోని కొండయ్యగూడెం, మేళ్లచెరువు మండలం కప్పుల కుంట తండా పంచాయతీ పరిధిలోని దుబ్బ తండా, హేమ్లతండా పరిధిలోని జగ్గు తండా, రాఘవాపురం కాలనీ, పద్మశాలీ కాలనీలను కలిపి జగ్గుతండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడానికి జీఓ విడుదల చేశారు. చిన్న చిన్న గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడితే త్వరగా అభివృద్ధి చెందుతాయని ప్రత్యేక చొరవ చూపి నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం పని చేస్తున్నా. ఇక్కడి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. నేను గెలిచిన మూడున్నరేండ్లలో నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో రూ.3500కోట్లు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టా. వాటిలో కొన్ని పనులు ముగియగా మరికొన్ని ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో ఐదు గ్రామ పంచాయతీలు ఏర్పడడం శుభదాయకం.
– శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే