తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం అజరామరమని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం సూర్యాపేటలో అమరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. పట్టణంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం అమరుల కుటుంబాలను సన్మానించారు. వారితో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేంద్రం పన్నిన కుట్రలు, విషపు రాజకీయాలకు ఆత్మబలిదానాలు జరిగాయని, వైరి వర్గాలు అనుకున్న చంద్రబాబు, వైఎస్ఆర్ తెలంగాణ అంశంలో ఒక్కటై చేసిన కుయుక్తులు కూడా దానికి కారణమని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. సాధించుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ సుభిక్షంగా మారిందని, పుష్కలంగా సాగునీరు, 24 గంటల కరంట్తో బీడు భూములు సస్యశ్యామలమయ్యాయని అన్నారు. సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో జరుపుకున్న దశాబ్ది ఉత్సవాలు చరిత్రలోనే అరుదైన ఘట్టంగా మిగిలిపోతాయని తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు కృషి ప్రశంసనీయమన్నారు.
– సూర్యాపేట, జూన్ 22 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం అజరామరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలో వారి పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. వారి స్ఫూర్తిని వర్తమానానికి అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ప్రతి ఏడాది తెలంగాణ అమరవీరుల దినోత్సవం జరుపుకొంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా చివరి రోజు గురువారం అమరుల దినోత్సవాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక మినీ ట్యాంక్బండ్ వద్ద జరిగిన దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైరి వర్గాలు అనుకున్న చంద్రబాబు, వైఎస్ఆర్ తెలంగాణ అంశంలో ఒక్కటై పన్నిన కుయుక్తులు, రాష్ట్ర ఏర్పాటులో యూపీఏ అలసత్వం కూడా ఉద్యమంలో యువత బలిదానాలకు కారణమైనట్లు తెలిపారు. అటువంటి తెలంగాణ అమరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండదదండలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
బలిపీఠమెక్కి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్
ఉద్యమం నుంచి పక్కకు తప్పుకొంటే రాళ్లతో కొట్టి చంపండి అన్న మాటలకు కట్టుబడి పోరాడి రాష్ర్టాన్ని సాధించిన ఘనుడు సీఎం కేసీఆర్ అని మంత్రి అన్నారు. త్యాగాల పునాదుల మీదే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. రాష్ట్ర సాధనలో మంత్రి పదవిని త్యజించిన దివంగత నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అధికారిక నివాస గృహం జలదృశ్యం నుంచి 2001లో రాష్ట్ర సాధన ఉద్యమానికి కేసీఆర్ అంకురార్పణ చేశారన్నారు. ఉద్యమంపై నీలి నీడలు కమ్ముకునేలా నాటి సీమాంధ్ర పాలకులు, వారికి వత్తాసు పలికిన తెలంగాణ ప్రాంత నాయకులు అపోహలు, అనుమానాలు సృష్టించారని, దానికి తోడు మీడియా హౌజ్ల విషపు రాతలు ప్రజల్లో గందరగోళం సృష్టించినట్లు తెలిపారు. అటువంటి స్థితిలో రక్తం చిందకుండా, హింస ప్రజ్వరిల్లకుండా రాష్ర్టాన్ని సాధించాలని కేసీఆర్ బయల్దేరితే విపక్షాల కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు తల్లడిల్లిన యువత ఆత్మబలిదానాలకు పాల్పడినట్లు చెప్పారు. దీనికి కుమిలిపోయిన కేసీఆర్ తానే స్వయంగా బలిపీఠమెక్కి రాష్ర్టాన్ని సాధించినట్లు మంత్రి పేర్కొన్నారు.
తొమ్మిదేండ్లలో సుభిక్షంగా తెలంగాణ
సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం సుభిక్షంగా మారిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. బీళ్లుగా మారిన పంట పొలాలకు సమృద్ధిగా సాగునీరు, ఇంటింటికీ సురక్షిత తాగునీరు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో ఇతరులెవరూ పోటీ పడలేని విధంగా సీఎం మార్పు తీసుకొచ్చినట్లు చెప్పారు. సంక్షేమ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు కేసీఆరే దీటు అనేలా పథకాలు రూపుదిద్దుకుని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం కేసీఆర్ రూపొందించిన రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా మంత్రి అభివర్ణించారు. అనంతరం అమరుల కుటుంబాలతో కలిసి తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి విందు ఆరగించారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ పాల్గొన్నారు.