ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చండూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేశారు. ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు కార్యాలయాన్ని సిద్ధం చేశారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక చండూరు, మునుగోడు, గట్టుపల్, నాంపల్లి, మర్రిగూడ మండలాలకు రెవెన్యూ డివిజన్ సేవలు చేరువ కానున్నాయి.
చండూరు అక్టోబర్ 3: ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరింది. చండూరు కేంద్రంగా ఐదు మండలాలతో ఆర్డీఓ కార్యాలయం బుధవారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కార్యాలయం ప్రారంభించనున్నారు. గతంలో నాంపల్లి, మర్రిగూడ మండలాలు దేవరకొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉండగా చండూరు, మునుగోడు గట్టుప్పల మండలాలు నల్లగొండ డివిజన్ పరిధిలో ఉండేవి. ఇప్పటి నుంచి చండూరు డివిజన్ పరిధిలోకి రానున్నాయి. చండూరు, మునుగోడు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ మండలాల ప్రజలకు సేవలు అందనున్నాయి. అలాగే చం డూరు మండలం ఇడికుడ నుంచి నాంపల్లి మండలం ముష్టిపల్లి వరకు రూ.56 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులు, చండూరు మండలం బంగారిగడ్డలో మంత్రి జగదీశ్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
ఏర్పాట్లు పరిశీలన
చండూరులో ఏర్పాటు చేయనున్న ఆర్డీఓ కార్యాలయ భవన ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రైతులు నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆయన వెంట తాసీల్దార్ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్, కొండ్రెడ్డి యాదయ్య, సర్పంచులు చొప్పరి అనురాధావెంకన్న, నల్ల లింగయ్య ఉన్నారు.