నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలను మరో 5 రోజులు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు వేసిన పంటలకు సరిపడా నీరు అందక ఎండిపోతున్న విషయం తెలుసుకున్న హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం కేసీఆర్ స్పందిస్తూ ఇప్పటికే ఇచ్చిన షెడ్యూల్కు అదనంగా ఈ నెల 21 వరకు నీటి విడుదలను పొడిగించాలని ఆదేశించారు. ఎగువ కృష్ణా నుంచి వరద లేని నేపథ్యంలో సాగర్ జలాశయంలో సమృద్ధిగా నీళ్లు లేకపోయినా పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు ఇస్తుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– నేరేడుచర్ల, అక్టోబర్ 14
నేరేడుచర్ల, అక్టోబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్తో సాగర్ ఆయకట్టు పరిధిలో బోర్లు, బావుల ఆధారంగా రైతులు వరి సాగు చేశారు. వర్షాలు కురువక భూగర్భజలాలు తగ్గి ప్రస్తుతం అవి ఎండిపోయే పరిస్థితికి చేరాయి. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి ఈ నెల 7 నుంచి 15 వరకు నీటిని విడుదల చేయించారు. ఈ నీటితో నియోజకర్గంలోని వ్యవసాయ క్షేత్రాలతోపాటు చెరువుల్లో కొంత నీరు చేరి భూగర్భజలాలు పెంపొందాయి. అయినప్పటికీ పొలాలు చివరి దశలో ఉన్నందున మరో వారం రోజులు నీటిని విడుదల చేస్తే పూర్తిస్థాయిలో పంట చేతికి వస్తుందని రైతులు ఎమ్మెల్యేను కోరారు.
ఈ సమస్యను శనివారం ఎమ్మెల్యే సైదిరెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మరో ఐదు రోజులపాటు నీటిని విడుదల చేయాలని నీటి పారుదల అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం ప్రజలతో మమేకమవుతున్న ఎమ్మెల్యే పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమంతోపాటు రైతుల మేలు కోరుకునే నాయకుడు మన ముఖ్యమంత్రిగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టం. వ్యవసాయానికి పెట్టుబడి సాయంతోపాటు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారు. సాగర్ డ్యామ్లో నీరు లేక, వర్షాలు రాక పంటలు ఎండిపోతున్నాయని ఈ నెల 6న సీఎం దృష్టికి తీసుకెళ్లగా 7న సాగర్ నీటిని విడుదల చేయించారు. పంట పొలాలు చివరి దశలో ఉన్నాయని మరో కొద్దిరోజులు నీటి విడుదల కొనసాగించాలని కోరగా వెంటనే నీటి పారుదల శాఖకు ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్కు రైతుల పక్షాన కృతజ్ఞతలు.
– శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే