కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లా అంతటా అన్నదాతల ఇంట ఆనందం వెల్లివిరిసింది. గురువారం ఊరూరా రైతులు వేడుకలు నిర్వహించారు. పీఏసీఎస్ సెంటర్లు, రైతు వేదికలతోపాటు పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. రైతులతోపాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిమాన నేత సీఎం కేసీఆర్కు వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలిపేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులు పోటీపడ్డారు. వడ్ల గింజలతో ధాన్యాభిషేకం నిర్వహించారు. పొలాల్లో వరి నారుతో సీఎం కేసీఆర్ పేరునుపేర్చి ప్రేమను కురిపించారు. ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోలుతో ఇప్పటికే అండగా నిలుస్తుండగా, తాజాగా రుణమాఫీ చేయడంతో చాలా చోట్ల రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులు స్వచ్ఛందంగా వేడుకల్లో భాగస్వాములయ్యారు. నకిరేకల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, త్రిపురారంలో ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్, సూర్యాపేటలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ పాల్గొన్నారు. ఇక గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా రుణమాఫీ అమలుపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో జిల్లా ఎమ్మెల్యేలంతా సీఎం కేసీఆర్ను కలిసి ఉమ్మడి జిల్లా రైతాంగం
తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా తొలిరోజు రూ.41 వేల వరకు లోన్ ఉన్న రైతుల రుణాల మాఫీ జరిగింది.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ)
నాకు ఎకరం పొలం ఉంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కష్టం తెలిసినోడు కాబట్టే రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నడు. ఇప్పుడు రైతులు తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేస్తున్నడు. నాకు ఇయాల పొలం పనుండే. సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తుండు అని తెలిసి ఆయనకు క్షీరాభిషేకం చేయాలని మావోళ్లు అన్నరు. అందుకే పొద్దుగాల 7గంటలకే అందరితోని కలిసి నకిరేకల్కు వచ్చిన. ఎమ్మెల్యే చిరుమర్తి లింగన్న నాతోని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలు పోయించిండు. నా మనసులనే అనుకున్న మల్ల గూడ కేసీఆరే సీఎం కావాలని. ఏం ఇచ్చినా ఆయన రుణం తీసుకోలేను. ఒక్క ఓటు వేసి తప్ప. మళ్లీ కేసీఆరే రావాలి.. రైతుబంధు ఇయ్యాలి. నా బిడ్డలకు కూడా చెప్తా.. ఎవనితోని పడితే వానితోని తిరుగొద్దని. తిరిగితే సాయం చేస్తోనితోనే తిరుగు.. ఆ సాయం కూడా కేసీఆర్ సార్ సాయంలాగా ఉండాలని చెప్తా.
మేడ పెద్దసాయిలు, రైతు, తాటికల్ గ్రామం, నకిరేకల్ మండలం
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పంట రుణమాఫీ అమలు నిర్ణయంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
పటాకులు కాల్చి స్వీట్లు పంచున్నారు. రైతులు పొలాల వద్ద నారు కట్టలతో ముఖ్యమంత్రి పేరు రాసి అభిమానం చాటుకున్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రతిన బూనారు. ఇప్పటికే రైతుబంధు, రైతు బీమా పథకాలతో ఆదుకుంటున్న ప్రభుత్వం రుణమాఫీతో తమ కష్టాలు
తీర్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ తీసుకున్న లక్ష రూపాయల రుణమాఫీ అమలు నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతుబీమా నిరంతర ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం ప్రస్తుతం రుణమాఫీని అమలు చేయడం హర్షణీయం. దీంతో రైతుల కల నెరవేరింది. రైతులందరూ సీఎం కేసీఆర్కు సార్కు ఎల్లవేళలా అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతు రాజ్యం రావాలంటే అన్ని వర్గాల రైతులందరూ.. కేసీఆర్కు మద్దతు తెలుపాలి.
– పుట్ట నర్సిరెడ్డి, రైతు పుల్లాయిగూడెం,ఆత్మకూరు(ఎం) మండలం
నాకు మూడెకరాల భూమి ఉంది. ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే పెట్టుబడికి ఇతరుల దగ్గర చేయి చాపి అప్పు చేయాల్సి వస్తుండే. కేసీఆర్ సార్ ప్రభుత్వం వచ్చాక పెట్టుబడి సాయం ఇస్తున్నది. ఇప్పుడు రుణమాఫీ అమలుతో నా లక్ష రూపాయల రుణం మాఫీ అవుతుంది. ఇంతకంటే ఏం కావాలి. దేశంలో రైతులను పట్టించునేది ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆర్ మాత్రమే. ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నడు. పంట పెట్టుబడికి తీసుకున్న అప్పును ప్రభుత్వం మాఫీ చేయడం గొప్ప విషయం. సాగు నీరు, విత్తనాలు, ఎరువులు, కరంట్, రైతుబంధు, రైతుబీమా, పంట కోనుగోలు చేయడానికి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం బీఆర్ఎస్ సర్కారుకే సాధ్యమైంది. కాంగ్రెస్ వాళ్ల మాటలు ఎవరూ నమ్మరు. రుణమాఫీ ప్రకటన రాకుంటే ప్రతిపక్షాలు ఎగిరి గంతులేసేవి. వారికి బుద్ధి చెప్పేలా సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేసి అన్నదాతలందరికీ అండగా నిలచారు. అందుకే రైతులు సీఎం కేసీఆర్ను మరువరు, గుండెల్లో పెట్టుకుంటారు.
– నేనావత్ లిమ్యానాయక్, వడ్త్యాతండా, కొండమల్లేపల్లి మండలం
రైతుల బాగోగులు పట్టించుక్నుది సీఎం కేసీఆర్ ఒక్కరే. కరోనాతో కొంత ఆలస్యమైనా ఇప్పుడు విడుతల వారీగా సెప్టెంబర్ రెండో వారం వరకు పూర్తి రూణమాఫీ చేయాలని ఆదేశించడం ఎంతో ఆనందంగా ఉంది. నేను బ్యాంకు నుంచి లక్ష రూపాయల రుణం తీసుకున్నా. ప్రతి సంవత్సరం వడ్డీ కట్టి రెన్యూవల్ చేసుకుంటున్నా. ప్రస్తుతం సీఎం కేసీఆర్ పుణ్యాన వడ్డీ కట్టే బాధ తప్పడంతో పాటు, రుణం కూడా మాఫీ అవుతుంది. సీఎం కేసీఆర్ రైతులకు చాలా గొప్ప పనులు చేస్తున్నడు. రైతుబంధు పెట్టి పెట్టుబడికి అప్పులు చేయకుండా చేసిండు. రైతు బీమా చేయించి కుటుంబాలకు అండగా నిలిచిండు. ఈ తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. వ్యవసాయానికి 24గంటల కరంట్ ఇచ్చి పంటల సాగును ప్రోత్సహించారు. సీఎం కేసీఆర్ది రైతు ప్రభుత్వమని రూణమాఫీతో మరో సారి రుజువు చేసిండు. రైతులకు ఇన్ని పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆరే ఎల్లప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.
– ఇస్లావత్ బిచ్యానాయక్, కేశ్యాతండా, కొండమల్లేపల్లి మండలం