తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. సూర్యాపేట కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య పాల్గొన్నారు. అణగారిన వర్గాలను చైతన్యపరుస్తూ వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి అని ఐలమ్మ సేవలను కొనియాడారు. ఐలమ్మ సాహసమే నేడు తెలంగాణ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.
మిర్యాలగూడ, సెప్టెంబర్ 26 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ పాలనలో పోరాట యోధులకు సముచిత స్థానం దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు చిట్టిబాబునాయక్, అన్నభీమోజు నాగార్జునాచారి, రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కర్నాటి రమేశ్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణాచౌదరి పాల్గొన్నారు.
ధీర వనిత ఐలమ్మ
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొరల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం సాగర్రోడ్డులో గల ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో దొరల గడీలను గడ గడ లాడించిన వీరనారి ఐలమ్మ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని నేటి మహిళలు సమాజంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై పోరాటం చేయాలన్నారు. ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రతి సంవత్సరం ఆమె జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అంతకు ముందు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐలమ్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జె.శ్రీనివాస్ నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, చీర పంకజ్, ప్రభాకర్, చిట్ల వెంకటేశం, చిలకరాజు చెన్నయ్య, రాములు, అంజయ్య, పున్న గణేశ్, పూజిత శ్రీను, ఐతగోని జనార్ధన్గౌడ్, శేఖర్, నాగిళ్ల యాదయ్య, శంకర్ పాల్గొన్నారు.
జడ్పీలో ఐలమ్మ జయంతి
నల్లగొండ : వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్రెడ్డి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు తిరుపతయ్య, ముజీబొద్దీన్, పీఆర్ డీఈ నాగయ్య, సూపరింటెండెంట్ నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా నివాళి
చాకలి ఐలమ్మ జయంతిని జిల్లా వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించారు. అన్ని మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ముఖ్య కూడళ్లలో ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఐలమ్మ చూపిన పోరాట పటిమను అందరూ ప్రశంసించారు.