దమ్మపేట, ఆగస్టు 07 : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ దమ్మపేట మండల కన్వీనర్ మురహరి రఘు అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఎంపీడీఓ రవీందర్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తుందని విమర్శించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ నాయకులు విజయలక్ష్మి, యశోద, మల్లేశ్వరి, భవాని, నరసమ్మ పాల్గొన్నారు.