యాదాద్రి, నవంబర్ 29 : రాబోయే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో తమ పొత్తును కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో పట్టణంలో మంగళవారం జరిగిన ఏఐటీయూసీ 3వ మహాసభ ముగింపు సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసి విఫలమై అడ్డంగా దొరికిందన్నారు.
ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నం చేసి బీజేపీ ప్రజల్లో దోషిగా నిలిచిందన్నారు. ఈడీ, సీబీఐ దాడులతో దేశంలో అరాచకాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బీజేపీతో దేశానికి అత్యంత ప్రమాదం ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల నుంచి ప్రధాని మోదీకి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
దేశ సంపదను ఒకరి చేతిలో పెట్టాలని ప్రధాని మోదీ ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. 75 శాతం దేశ సంపద ఆదానీ, అంబానీ చేతిలో పెట్టాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాల్రాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ.ఎస్.బోస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ. యూసుఫ్, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఉజ్జిని రత్నాకర్రావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, బి. వెంకటేశం, మహాసభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.