– సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
సూర్యాపేట, డిసెంబర్ 02 : నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. అనంతగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అనంతగిరి, కిష్టపురం, అమీనాబాద్, కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గుడిబండ, అడ్లూర్, తొగర్రాయి, అల్వలపురం సర్పంచులకు, వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని, అనంతగిరి ఎంపీడీఓ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.
నామినేషన్ కేంద్రాల్లో సాయంత్రం 5:00 గంటల తర్వాత నామినేషన్ వేయుటకు అభ్యర్థులు ఉంటే వారికి టోకెన్లు జారీ చేయాలన్నారు. అనంతగిరి ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ ఆన్లైన్ చేసే విధానాన్ని పరిశీలించారు. నామినేషన్లను స్వీకరించిన తర్వాత వెంటనే ఎలాంటి తప్పులు దొర్లకుండా టి పోల్ యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సూర్యనారాయణ, తాసీల్దార్లు హిమబిందు, వాజీద్ అలీ, ఎంపీడీఓలు హరిసింగ్, ఇజాక్ హుస్సేన్, ఎంపీఓ సుష్మ ఉన్నారు.