నల్లగొండ సిటీ, జనవరి 3 : మహాలక్ష్మి పథకంలో మహిళలకు ప్రభుత్వం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య రెండింతలు పెరిగింది. బస్సులు కెపాసిటీకి మించి వెళ్తున్నాయి. దాంతో బస్సులు తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయంటున్నారు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. కేఎంపీఎల్ కూడా రావడం లేదంటున్నారు. ఖర్చుల భారం భరించలేమంటూ ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్ఎమ్కు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 7 డిపోల పరిధిలో 254 అద్దె బస్సులు నడుస్తున్నాయి. కేఎంపీఎల్ తగ్గించి చార్జీలు ఇవ్వాలని, బస్సు టైర్లను బల్క్ రేట్లకే అందజేయాలని, ప్రమాదం జరిగినప్పుడు ైక్లెయిమ్కు ఇబ్బంది లేకుండా చూడాలని పలు డిమాండ్లను అద్దె బస్సు యజమానులు ప్రభుత్వం ముందుంచారు. సమ్మెతో సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందిగా
మారనున్నది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకొచ్చాక నల్లగొండ రీజియన్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు ఖాళీ లేకుండా వెళ్తున్నాయి. ఈ పథకం అమల్లోకి రాక ముందు నల్లగొండ ఉమ్మడి జిల్లా రీజియన్ పరిధి 7 డిపోల్లో ప్రతిరోజూ 2 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 3లక్షలకు చేరింది. ఇందులో 2లక్షల మంది మహిళలే ఉండడం గమనార్హం. నల్లగొండ రీజియన్లో 7 డిపోలకుగానూ 637 బస్సులు ఉన్నాయి. ఇందులో ఆర్టీసీ 383, అద్దె బస్సులు 254 నడుస్తున్నాయి.