నల్లగొండ ప్రతినిధి, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏప్రిల్ ఒకటిన నల్లగొండకు రానున్నారు. జిల్లాకేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్సభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశానికి కేటీఆర్తో పాటు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు తరలిరానున్నారు.
సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో ప్రచార ఎజెండా, అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను, ప్రభుత్వ మోసాలను, కరువు తదితర పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్చించనున్నారు. నల్లగొండ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ ముఖ్యులంతా ఈ సమావేశంలో పాల్గొనేలా ఆహ్వానించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. కృష్ణారెడ్డి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలిసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నల్లగొండ సమావేశం అనంతరం ప్రచార షెడ్యూల్ రూపొందించుకుని విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు.