హాలియా, జనవరి 25 : దేశ ప్రజల ఆకాంక్ష మేరకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని, పార్టీ ప్రారంభించిన అనతికాలంలోనే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. బుధవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో త్రిపురారం మండలం రాగడప, కంపసాగర్ గ్రామాలకు చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేతగాని తనం వల్లే దేశంలో చీకట్లు అలుముకున్నాయని, ఆ చీకట్లను తొలగించి వెలుగులు ప్రసరింపజేసే సత్తా సీఎం కేసీఆర్కే సాధ్యమని పేర్కొన్నారు.
దేశ ప్రజలంతా తెలంగాణ మాడల్ పాలన కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, నిడమనూరు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, మాజీ ఎంపీపీ ధూళిపాల ధనమ్మారాంచంద్రయ్య, ఎంపీపీ సలహాదారు బొల్లం రవి, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు దస్తగిరి, సర్పంచులు రేవూరి కొండల్, దాసరి అవిశయ్య, మాజీ సర్పంచ్ రేవూరి కోటయ్య, మాజీ ఎంపీటీసీ పోశబోయిన సైదులు పాల్గొన్నారు.