సూర్యాపేట, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : సంక్షేమ పథకాల ఆచరణలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తాన్ని ఆకర్షించి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో సంక్షేమాన్ని చేరవేస్తున్నది. అరవై ఏండ్ల గోసను రూపుమాపుతూ సంక్షేమాన్ని అందిస్తున్నది. బుక్కెడు బువ్వ, గుక్కెడు నీటి కోసం పడిన కష్టాలు.. వ్యక్తిగత అవసరాలకు కనీసం రూ.100 కావాలన్నా ఇతరుల వద్ద చేయి చాపే దుస్థితి నుంచి ఆత్మగౌరవంతో బతికే స్థితికి చేరవేసింది. స్వరాష్ట్రంలో ఉద్యమ నేత కేసీఆరే ముఖ్యమంత్రి కావడంతో అందరి కష్టాలు తీరాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చినా, ఇయ్యకపోయినా సమాజంలోని ఏ వర్గానికి ఏది అవసరమో తెలుసుకుని మరీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు.
ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలో తొమ్మిదేండ్లలో ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు రుణమాఫీ, రైతు బంధు తదితర సంక్షేమ పథకాల ద్వారా జిల్లాలోని 19,82,217 మంది లబ్ధిదారులకు రూ.12,254.95 కోట్ల లబ్ధి చేకూరింది. సమాజంలో అట్టడుగున ఉండి సాయం కోసం దీనంగా ఎదురు చూసిన వారు నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సంతోషంగా ఉంటున్నారు. ప్రతి ఇల్లు నిలయంగా మారింది. దాంతో సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఈ విషయం తొమ్మిదేండ్లుగా ఏ ఎన్నికల ఫలితాలు చూసినా అర్థం అవుతుంది. 2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ ప్రారంభం నుంచి రాష్ట్ర సాధన వరకు నాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలవుతున్నాయి.
రాష్ట్రం ఏర్పడితే మన నిధులు, మన ఉద్యోగాలు మనకొస్తాయి.. మన కరెంట్ మనకు వస్తుందంటూ నాడు చెప్పిన ప్రతి విషయం నేడు కండ్ల ముందు సాక్షాత్కారమైంది. నేడు 24 గంటల కరెంట్ వస్తుంది. సాగు, తాగు నీరు పుష్కలంగా లభిస్తున్నది. ఉద్యోగాలు వస్తున్నాయి. ఇక నిధుల విషయంలో కొరతే లేకుండా పోయింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు జోడెడ్ల మాదిరిగా పోటీ పడి ప్రయాణిస్తున్నాయి. ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకుల అసమర్థత కారణంగా సూర్యాపేట జిల్లా కరువు కాటకాలకు నిలయంగా ఉండేది. పంటలు పండక రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం.. ఉన్న పశు సంపదను తెగనమ్ముకోవడం, ఉపాధి కోసం పట్నం బాట పట్టడం ఇదీ నాటి దుస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత నేటి పరిస్థితి చూస్తే వలసలు వాపస్ అయినయ్. అందరికీ పని దొరుకుతుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్ వేల కోట్లతో చేపడుతున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు సంతోషంగా జీవనం గడుపుతున్నారు.
సామాజిక బాధ్యతలను నిర్వర్తించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు ఇలా మొత్తం 11 క్యాటగిరీల వారికి పింఛన్లు అందిస్తూ మానవీయతను ప్రదర్శిస్తున్నది. గతంలో వృద్ధులకు రూ.200 పింఛన్ ఇవ్వగా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఏకంగా రూ.2వేలు, దివ్యాంగులకు రూ.3వేలు చేయడంతో లబ్ధిదారులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. నెలనెలా వేతనం వచ్చినట్లు డబ్బులు వస్తుండడంతో వృద్ధులను చూసే తీరులో కుటుంబ సభ్యుల ప్రవర్తన సైతం మారింది. ఇదంతా కేసీఆర్ సారు చలవేనంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన పింఛన్లతో ఇప్పటి వరకు జిల్లాలో 1,31,226 మందికి నెలనెలా రూ.1,627 కోట్లు అందుతున్నాయి. తిరిగి అధికారంలోకి రాగానే పింఛన్ను రూ.5వేలకు పెంచుతామని బీఆర్ఎస్ చెప్పడంతో కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని పింఛన్దారులు ప్రతిన బూనుతున్నారు.
కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం వేలాది గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సన్న బియ్యం, వెజ్, నాన్వెజ్తో రుచికరమైన భోజనం, ఆహ్లాదకరమైన క్యాంపస్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏడున్నర సంవత్సరాల కాలంలో 28 గురుకులాలు ప్రారంభం కాగా వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలో 4 సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ, ఎస్టీ సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల, డిగ్రీ కాలేజ్తోపాటు 12 బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు, 4 మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలు, మరో 4 మైనారిటీ సంక్షేమ గురుకుల కళాశాలలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా 18వేల మందికి రూ.214 కోట్లతో సబ్సిడీ గొర్రెలు, మత్స్యకారుల సంక్షేమం కోసం 29 వేల మందికి రూ.32 కోట్లు, దాదాపు 50 వేలకు పైగా మందికి సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీల రూపంలో సుమారు రూ.132 కోట్లకు పైనే ఆర్థిక సాయం అందించడం జరిగింది. మొత్తంమీద తొమ్మిదేండ్ల కాలంలో జిల్లాలోని 19,82,217 మందికి రూ.12,254.95 కోట్ల లబ్ధి చేకూరింది.
రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అందించిన గొప్ప కానుక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు. పేద తల్లిదండ్రులు తమ ఆడబిడ్డల పెండ్లి చేసేందుకు పడే బాధలను దూరం చేసేలా, అలాగే బాల్య వివాహాలను నిర్మూలించేలా సీఎం కేసీఆర్ ఈ పథకాలకు రూపకల్పన చేసి విజయవంతంగా చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆడపిల్ల పెండ్లికి రూ.1,00,016 అందిస్తున్నది. పథకం ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలో 32,760 మంది ఆడపిల్లల వివాహాలకు రూ.315.39 కోట్లు అందించింది.
నాడు అందరికంటే అరిగోస పడిన వర్గం ఏదైనా ఉన్నదంటే అది రైతాంగం అనక తప్పదు. కానీ.. నేడు ఆ వర్గం సంతోషంగా ఉన్నది. 24 గంటల ఉచిత కరెంట్, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుతుండడం, వీటికి తోడు పంటల సాగుకు ముందే ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం, మద్దతు ధరతో పంటల కొనుగోళ్లు, రుణమాఫీతో రైతుల కష్టాలు తీరినయ్.
అలాగే ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే
వారం రోజుల్లోనే రైతు బీమా ద్వారా రూ.5 లక్షలు అకౌంట్లో పడుతున్నాయి. రైతు బంధు పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో 19.25 లక్షల మంది రైతులకు రూ.3,251.78 కోట్లు అందాయి. ఇప్పటి వరకు వివిధ కారణాలతో 3,175 మంది రైతులు మృతిచెందగా.. వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో రూ.159 కోట్లు జమయ్యాయి.
ఏ ఆధారం లేని ముసలోళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే ఆసరా పింఛనే ఆదెరువయ్యింది. ఆయన ఇస్తున్న రూ.2016తో చానామంది ముసలోళ్లు ఇబ్బందులు లేకుండా బతకుతుండ్రు. కన్న కొడుకులు, బిడ్డలు గూడా తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్న ఈ రోజుల్లో కేసీఆర్ ముసలోళ్లందరికీ దేవుడిచ్చిన కొడుకైండు. ఇయ్యాల ఎంతో మంది ముసలోళ్లు ఏ ఇబ్బందీ లేకుండా బతుకుతున్నరంటే ఆయన చలువే. ఏ పార్టోళ్లు ఏనాడైనా ముసలోళ్ల గురించి ఇంత మంచిగా ఆలోచించిండ్రా. ఇన్ని పైసలిచ్చిండ్రా. పింఛన్ను ఐదేండ్లలో రూ.5,016కు పెంచుతనన్నడు. కేసీఆర్ మాటంటే మాటే.. పెంచి తీరుతడు. ఇగ మాలాంటోళ్లకు ఏం గావాలే. ఇటువంటి మనిషి ముఖ్యమంత్రిగా ఉంటేనే మాలాంటి వాళ్ల బాధలు తీరుతయ్. కాబట్టి ఈసారి ఎన్నికల్లో ముసలోల్లంతా కారు గుర్తుకే ఓటెయ్యాలె.. పింఛన్ డబ్బులు రూ.5,016 ఎత్తుకోవాలె.
– పోలంపల్లి గోపయ్య, ఆసరా పింఛన్ లబ్ధిదారు, కీతవారిగూడెం, గరిడేపల్లి
తెలంగాణ రాష్ట్రం రాక ముందు పంట పెట్టుబడి కోసం గ్రామాల్లో ఉన్న షావుకారు వద్దకు వెళ్లి అప్పులు తెచ్చి వ్యవసాయం చేసేవాడిని. నీళ్లు లేక, కరెంట్ రాక రాత్రనక పగలనక కష్టపడితే దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చేది. వచ్చిన దిగుబడి మిత్తి కిందకు సరిపోయేది. అసలు అప్పు అలాగే మిగిలేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతుల కష్టాలు తెలిసిన మహనీయుడు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం పథకాలు తెచ్చాడు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటివి ఎన్నో జలాలతో రైతులు నేడు రెండు పంటలు పండిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. రైతాంగమంతా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్లవేళలా రుణపడి ఉంటాం.
– తంగెళ్లపల్లి ఎల్లయ్య, రైతు, డి.కొత్తపల్లి, నాగారం మండలం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతు బంధు సాయంతోనే పంటకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తూ పెట్టుబడికి ఖర్చు చేస్తున్నాం. నాకు మఠంపల్లి మండలం లాలితండాలో 3ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. గతంలో వ్యవసాయం చేయాలంటే బంగారాన్ని పెట్టడమో, అధిక మిత్తీకి తెచ్చి పంటకు పెట్టుబడి పెట్టేవాడిని. గతంలో ఎరువుల షాపుల దగ్గర ఎరువులు, విత్తనాలు అప్పుగా తెస్తే పండిన పంటను దుకాణాదారులు అడిగిన రేటుకే ఇవ్వాల్సి వచ్చేది. నేడు ప్రభుత్వం నుంచి సమయానికి రైతు బంధు సహకారం అందడం వల్ల పెట్టుబడికి చింత లేకుండా పంటలు పండిస్తూ ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధర పొందుతున్నాం. సీఎం కేసీఆర్ చేస్తున్న సాయం ఒక రైతుగా మర్చిపోలేను. కేసీఆర్కు రుణపడి ఉంటా.
– బానోతు రాములు, లాలితండా, మఠంపల్లి మండలం
సీఎం కేసీఆర్ సార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీ చేయగా వేలు లబ్ధి పొందాను. చాలా సంతోషంగా ఉన్నా. తిరిగి బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నా. మన ముఖ్యమంత్రి అడగకుండానే పేదల కోసం ఎన్నో పథకాలు పెట్టాడు. అందరికీ పథకాలు అందుతున్నాయి. తిరిగి మూడోసారి కేసీఆర్ సీఎం అయ్యేందుకు మా కుటుంబం మొత్తం స్వచ్ఛందంగా కారు గుర్తుకే ఓటేస్తాం. పేదల కష్టాలు తెలిసిన మనిషి కేసీఆర్ ఒక్కడే. ఆయనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుంది.
– బొమ్మరబోయిన శ్రీను, రైతు, వెంపటి గ్రామం, తుంగతుర్తి