సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలు విజయవంతంగా జరిగాయి. కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సభలకు పల్లెలు, పట్టణాలు, మారుమూల తండాల నుంచి జనం పెద్ద ఎత్తున
స్వచ్ఛందంగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సమైక్య పాలన పరిస్థితులు, స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. దశాబ్దాలుగా ఏమీ చేయని కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థులు బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్కుమార్ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరడంతో సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. చప్పట్లు, ఈలలు, కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది. కళాకారుల ఆటపాటలు ఉత్సాహం నింపాయి.
తిరుమలగిరి అక్టోబర్ 29 : తిరుమలగిరిలో ఆదివారం జరిగిన తుంగతుర్తి సమర శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అనుకున్నదానికంటే లక్షకు పైగా ప్రజలు వచ్చినట్లు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలు పొందడంతో సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. సభా ప్రాంగణమంతా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో మారుమ్రోగాయి.
సూర్యాపేట, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కోదాడలో ఆదివారం నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సభకు ప్రజలు దండులా కదిలారు. సుమారు 40వేల మంది ప్రజలు సభకు తరలివచ్చారు. హెలీకాప్టర్లో వస్తూ జనాన్ని గమనించిన సీఎం కేసీఆర్ మల్లయ్య గెలుపును ఎవరూ ఆపలేరని ప్రశంసలు కురిపించారు. మల్లయ్య బీసీ బిడ్డ, పీహెచ్డీ వరకు చదువుకున్న వ్యక్తి ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. కొంతమంది కుట్రలు చేస్తూ ఎన్ని ఒడిదొడుకులు సృష్టించినా నియోకవర్గాన్నే పట్టుకొని, జనాన్నే నమ్ముకొని సేవ చేస్తూ తిరుగుతున్నాడని ప్రశంసించారు. తొమ్మిదిన్నరేండ్లలో ప్రభుత్వ పాలన విజయాలు ప్రత్యర్థి పార్టీల కుట్రలు, మోసాలను ఎండగట్టారు. సీఎం ప్రసంగిస్తున్నంత సేపు విమర్శలు చేసినా… అభినందించినా… సంక్షేమ పథకాలను గర్తు చేసినా సభ హోరెత్తడంతో ప్రతిసారి ప్రసంగాన్ని ఆపిఆపి కొనసాగించాల్సి వచ్చింది.