నల్లగొండ ప్రతినిధి, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత వైఖరిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలంటూ డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధం కావడం పట్ల బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ సర్కార్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టేందుకు దశల వారీ ఆందోళనలకు సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనుంది.
గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చినప్పుడు అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు అనధికారిక లేఅవుట్లోని ప్లాట్లను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి రాగానే ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామని కూడా ప్రకటించారు. అంతటితో ఆగకుండా జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అప్పట్లో ఎల్ఆర్ఎస్పై కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారు. కానీ.. నేడు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నాలుక మడతేశారు. ప్రభుత్వ ఖజానాను నింపుకొనేందుకు ఎల్ఆర్ఎస్ అమలుకు సిద్ధమవుతూ చార్జీల వసూలుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇటీవలే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిస్థితిని సీఎం రేవంత్రెడ్డి అధికారులను నివేదిక కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.54లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి.
అనధికారిక లేఅవుట్లు, ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకుని క్రమబద్ధీకరణ కాకుండా ఇబ్బందులు పడుతున్న వారి కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్లను తీసుకొచ్చింది. 2015లోనే కేసీఆర్ సర్కార్ 20వేల దరఖాస్తులను పరిష్కరించింది. ఆ తర్వాత కూడా ఇంకా పెండింగ్లో ఉన్న వాటి కోసం 2020 ఆగస్టు నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. దీన్ని ముందుకు పడకుండా అప్పట్లోనే కాంగ్రెస్ నేతలు అడుగడుగునా కుట్రలు చేశారు. కోర్టుల్లో కేసులు వేసి ఎల్ఆర్ఎస్ అమలు కాకుండా అడ్డుకున్నారు. దీంతో అప్పటి ప్రభుత్వం కూడా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పక్కన పెట్టక తప్పలేదు. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ వనరులను సమీకరించుకోవడం కోసం ఎల్ఆర్ఎస్ను ఆయుధంగా వాడుకోవాలని భావిస్తున్నది. ఇన్నాళ్లూ అడ్డంకులు సృష్టించి ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు సిద్ధపడింది.
రాష్ట్ర వ్యాప్తంగా 25లక్షల దరఖాస్తుదారుల నుంచి సుమారు రూ.20వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తూ ప్రజల జేబుకు చిల్లు పెట్టే పనిలో పడింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం రెట్టింపు చార్జీలు వసూలు చేయనున్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్ కోసం మార్కెట్ విలువలో 7.5 శాతం రుసుంను స్టాంప్ డ్యూటీగా వసూలు చేస్తుంటారు. కానీ.. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ పేరుతో 14శాతం స్టాంప్ డ్యూటీగా కట్టించుకోనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఒక్కో దరఖాస్తుదారుడిపై సగటున లక్ష రూపాయల భారం అనుకున్నా.. ఉమ్మడి జిల్లాలో రూ.2,540 కోట్లు వసూలు చేయనున్నారు. అప్పుడు ఉచితమని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కూడా ఉచితంగానే అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. అందులో భాగంగానే నేడు ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలకు సిద్ధమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ ధర్నాలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ ధర్నాలు ప్రారంభం అవుతాయని, దరఖాస్తుదారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రావాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. రేపు జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.
నేటి బీఆర్ఎస్ ధర్నాను విజయవంతం చేయండి
మిర్యాలగూడ/కోదాడ/చందంపేట (దేవరకొండ) : ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా ఇవ్వాలన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుసుం విధించడాన్ని ఖండిస్తూ దేవరకొండలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. కోదాడలో నిర్వహించనున్న ధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోరారు. ఎల్ఆర్ఎస్ చార్జీలపై, సాగర్ కాల్వకు నీళ్లివ్వని ప్రభుత్వ వైఖరిపై మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.