యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : ‘భయపడాల్సిన అవసరం లేదు.. భవిష్యత్ మనదే. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఖిలాపై ఎగిరిగేది బీఆర్ఎస్ జెండానే. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షమే.’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఓటమి శాశ్వతం కాదు.. గెలుపునకు నాంది అని పేర్కొన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, బ్రేక్ తర్వాత కారు స్పీడ్ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పని చేశామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే కొట్లాడుదామని చెప్పారు.
భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్రావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. బీఆర్ఎస్ ఓడిపోయినా, సభలో పట్టనంత మంది రావడం మన బలానికి చిహ్నమన్నారు. ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగిందని, ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని ఆ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రైతుబంధు పడటంలేదని జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి అడిగితే ఆయనను పోలీసులతో బయటకు పంపించారని గుర్తు చేశారు. అధికారం ఉన్నదని తమ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులపై కేసు లు పెట్టడం, నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం గొప్పదనం కా దన్నారు. ఎన్నికల్లో అన్నీ అబద్ధాలు చెప్పారని, కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించాలని హితవు పలికారు.
బీజేపీని ఎదిరించే శక్తి ఒక్క బీఆర్ఎస్కే ఉన్నదని, తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ఎస్ పార్టీనేనని హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ సొంత ప్రయోజనాల కోసం పని చేస్తుందని, బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ కోసం పని చేస్తుందని చెప్పారు. అందరం రామ భక్తులమేనని, బీజేపీ రాష్ర్టానికి చేసిందేమీ లేదని, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను లాక్కెళ్లిందని, లోయర్ సీలేరును గుంజుకున్నదని మండిపడ్డారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అన్నారు. గెలుపోటములు సహజమని, కార్యకర్తలు అధైర్యపడవద్దని సూచించారు.
కాంగ్రెస్ కేసులు పెట్టినా, వేధించినా పార్టీ వెన్నంటి ఉంటుందని భరోసా కల్పించారు. అందరం కలిసి పనిచేస్తే భవిష్యత్ మనదేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరికీ పార్టీ అండగా ఉంటుందని, అన్ని విధాలు గా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ 420 హామీలపై గ్రామాలు, తండాల్లో చర్చ లు పెట్టాలని, ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. కాంగ్రెస్ హామీలు, ప్రజా సమస్యలపై కొట్లాడుదామని, సర్కారు తప్పిదాలను ఎండగడుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నాయకులు జడల అమరేందర్, అమరేందర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ను బొంద పెడ్తామని, జైళ్లో వేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారని.. కేసీఆర్ను అది చేస్తాం.. ఇది చేస్తామని అంటున్నవారు ఒక్కసారి ముట్టుకొని చూడాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి సవాల్ విసిరారు. ఉద్యమాల నుంచి వచ్చిన తమకు జైళ్లు కొత్తేం కాదని, అక్కడికి వెళ్తే తమకు సెల్యూట్ కొడుతారని అన్నారు. అధికారం ఉన్నదని విర్రవీగితే బాగుండదని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చారన్నారు. నల్లగొండకు కోమటిరెడ్డి ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓటమి సహజమని, ప్రజలు ఒక్కోసారి అబద్ధాలను నమ్మి అపోహ పడుతారని అన్నారు. ఓటమిని కార్యకర్తలపై వేయొద్దని, నాడు పార్టీ కార్యకర్తలే 30వేల మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. భువనగిరిలో ఎంతో అభివృద్ధి జరిగినా ఓడామని, ఇప్పుడు ప్రజలే ఎందుకు ఓడించామా? అనే బాధలో ఉన్నారని వివరించారు. తెలంగాణ ఉద్యమం కంటే ప్రభుత్వంలోనే ఎక్కువగా పని చేశామన్నారు. 420 నాయకుల మాటలను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు.
– మాజీ మంత్రి జగదీశ్రెడ్డి