నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని కృష్ణపట్టెలో పర్యటించేందుకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి
కేసీఆర్ మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మూడు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
సభలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, రమావత్ రవీంద్రకుమార్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభలకు తరలి వచ్చేందుకు ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ తోరణాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో ఆయా పట్టణాలు గులాబీమయమయ్యాయి. కాగా, నేడు జరుగనున్న సభలతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రచారం పూర్తి కానుంది.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.30 గంటలకు హుజూర్నగర్కు చేరుకోనున్నారు. హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గుట్టకు వెళ్లే మార్గంలోని విశాలమైన స్థలంలో ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో వారం రోజులుగా సభా ఏర్పాట్లు చేశారు.
సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం జరుగనున్న సభ కావడంతో సభికులకు అవసరమైన మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు సైతం విస్తృతంగా అందుబాటులో ఉం చేలా చర్యలు చేపట్టారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పట్టణం నలువైపులా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. హుజూర్నగర్ సభా అనంతరం హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ మిర్యాలగూడకు పయనం అవుతారు.
మిర్యాలగూడ
మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు మైదానంలో ఏర్పాట్లు చేశారు. హుజూర్నగర్ నుంచి సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మిర్యాలగూడకు చేరుకుంటారు. పక్కనే కొద్ది దూరంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. సీఎం రాక కోసం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణానికి నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చే ప్రజలు సులువుగా చేరుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
పట్టణానికి నలువైపులా సభా స్థలానికి కొద్ది దూరంలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. అక్కడే తమ వాహనాలను పార్క్ చేసి కాలినడకన సభా ప్రాంగణానికి ప్రజలు చేరుకోవాల్సి ఉంటుంది. సభా ప్రాంగణంలోనూ మంచినీరు, మజ్జిగ లాంటి అన్ని చర్యలు చేపడుతున్నారు. సభకు వచ్చే వీఐపీలు, మీడియా, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు ఇలా వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే భాస్కర్రావు వెల్లడించారు.
దేవరకొండ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు పట్టణంలోని ముదిగొండ రోడ్డులో విశాలమైన స్థలంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ మిర్యాలగూడ నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 3.30గంటల సమయంలో దేవరకొండకు చేరుకోనున్నారు. సభాస్థలికి సమీపంలోనే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా వాహనంలో సభా వేదిక వద్దకు చేరుకునేలా చర్యలు చేపట్టారు. 2018 ఎన్నికల సమయంలోనూ ఇదే స్థలంలో సీఎం కేసీఆర్ సభ నిర్వహించారు. సభకు వేలాదిగా జనం తరలివచ్చే అవకాశాలు ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభా స్థలంలోనే ప్రత్యేక గ్యాలరీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు మంచినీరు, ఇతర సౌకర్యాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రాక కోసం సర్వం సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రకటించారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో జరుగుతున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బహిరంగ సభలకు జనం తండోపతండాలుగా తరలొస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన భువనగిరి, మునుగోడు, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలకు జనం పోటెత్తారు. ఏ సభలో చూసి నా భారీ జన సందోహాం కనిపించింది. ఆయా నియోజకవర్గాల నలుమూలల నుంచి చిన్నా పెద్దా, ముసలి ముతక, ఆడ మగ తేడా లేకుండా సభకు తరలివస్తుండడంతో అన్ని చోట్ల జన జాతర్లను తలపించాయి.
ఊహించిన దాని కంటే రెట్టింపు సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు, వివిధ పథకాల లబ్ధిదారులు, సామాన్య ప్రజలు సభలకు వచ్చి కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నారు. అన్ని చోట్ల కేసీఆర్ ప్రసంగాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఇక నేడు జరుగనున్న హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ సభలకు సైతం వేలాదిగా తరలివచ్చేందుకు జనం సన్నద్ధం కావడం విశేషం. సీఎం కేసీఆర్ సభలకు వస్తున్న స్పందనను చూస్తుంటే ఉమ్మడి జిల్లాలో మరోసారి అన్నిస్థానాల్లో గులాబీ జెండా కు ఎదురుండదన్న చర్చ జోరుగా సాగుతోంది.