కారు పార్టీ మరింత స్పీడ్ పెంచనున్నది. ద్విముఖ వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లనున్నది. ఓ వైపు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తూనే.. మరో వైపు పార్లమెంట్ ఎన్నికలపై జోరు పెంచనున్నది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో జిల్లాలో గులాబీ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. ఎండిన పంటలతో నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేలా టూర్ ఉండనున్నది. అదే విధంగా పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ సమన్వయ సమావేశాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. ఈ నెలాఖరులోగా భేటీలను పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 30న లేదా వచ్చే నెల ఒకటిన పర్యటించే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందే టూర్ అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడినట్లు తెలిసింది. ఒకే దఫాలో మూడు జిల్లాలు కవర్ చేసే చాన్స్ ఉంది. రోడ్ షోలు చేసే అవకాశం ఉంది. జిల్లాలో భువనగిరితోపాటు ఆలేరులోని కొన్ని ప్రాంతాలను కవర్ చేయనున్నట్లు తెలిసింది. మొదటగా పంట నష్టపోయిన పొలాల వద్దకు వెళ్లి పరామర్శించాలని భావించినా, కొన్ని కారణాల రీత్యా రోడ్ షోను ఖరారు చేసినట్లు సమాచారం.
రైతుల్లో భరోసా నింపేలా..
ఎండిపోయిన పంటలతో నష్టాల పాలైన రైతుల్లో ధైర్యం నింపేలా కేసీఆర్ పర్యటన ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు. జిల్లాలో 2,93,232 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. కానీ వివిధ కారణాలతో పంట పొలాలకు సరిపడా నీరు అందడంలేదు. ప్రభుత్వం సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్ట లేదు. జిల్లాలో సుమారు 10వేల ఎకరాల్లో వరి ఎండిపోయింది. దీంతో ఎండిన గడ్డి జీవాలకు మేతకు తప్ప దేనికీ పనికిరాకుండా పోయాయి. దాంతో అన్నదాత లబోదిబోమంటున్నారు. రైతులకు జరిగిన నష్టంపై కేసీఆర్ ప్రసంగించడంతోపాటు తమ పదేండ్ల కాలంలో రైతుల కోసం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను విశదీకరించనున్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
రానున్న పార్లమెంట్ ఎన్నికలపైనా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరికి క్యామ మల్లేశ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని గులాబీ దళిపతి కేసీఆర్ సూచించారు. దీనికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. భేటీకి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు.. ఈ నెలాఖరులోగా భేటీలు పూర్తి చేయనున్నారు. జిల్లాలో ఒకటి రెండు రోజుల్లో తేదీలు ప్రకటించి.. సమావేశాలు నిర్వహించనున్నారు.
పదేండ్ల కాలంలో రైతులకు ఏనాడూ ఆపద రానివ్వలేదు. కేసీఆర్ పాలనలో అన్ని విధాలుగా అండగా నిలిచాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రైతులు బిక్కుబిక్కుమంటూ బతుకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం పంట పొలాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఫలితంగా రైతులు అరిగోస తీస్తున్నారు. జిల్లాలో వేల ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. వారం రోజుల్లో జిల్లాలో కేసీఆర్ టూర్ ఉంటుంది. రైతులకు ధైర్యం ఇచ్చేలా పర్యటన కొనసాగుతుంది. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు కూడా సన్నద్ధం అవుతున్నాం. అతి త్వరలోనే సమన్వయ సమావేశాలు ఉంటాయి. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా సమావేశాలు నిర్వహిస్తాం.
-గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆలేరు