భువనగిరి అర్బన్, మార్చి 30: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం సేవకుడిగా పనిచేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. శనివారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు డబ్బుల మీద ఆసక్తి లేదని, ప్రజలకు సేవ చేయాలనేదే తన అభిమతమన్నారు.
తనను గెలిపిస్తే భువనగిరి పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పదవుల కోసం పాకులాడుతున్నారు. చామల కిరణ్కుమార్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మళ్లీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 2018లో తనకు ఇవ్వాల్సిన ఇబ్రహింపట్నం సీటును ఉత్తమ్కుమార్రెడ్డి అమ్ముకోవడంతో తాను కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చానని, అప్పటినుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2500, ఆసరా పింఛన్ రూ.4వేలకు పెంపు నేటికీ అమలుకు నోచలేదన్నారు. రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి డబ్బులు పడక పోవడంతో వారు అప్పులు చేసి పంటలు సాగు చేశారన్నారు.
వెంటనే రైతుబంధును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఏవీ.కిరణ్కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్రెడ్డి, నీల ఓంప్రకాశ్గౌడ్, నాయకులు కంచి మల్లయ్య, పెంట నితీశ్ పాల్గొన్నారు.