దామరచర్ల, జూన్ 12 : యదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను ప్రైవేటీకరించే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో చేసిన విజ్ఞప్తిని గౌరవించి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మిర్యాలగూడ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సుమారు రూ.30 వేల కోట్ల వ్యయంతో యదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ప్లాంట్ కేవలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మాత్రమే కాదని, వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే మహత్తర ప్రాజెక్ట్ అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం యదాద్రి పవర్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయడం అంటే రాష్ట్ర ఆస్తులను, ప్రజల హక్కులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడమేనని మండిపడ్డారు.
ప్లాంట్ నిర్మాణ సమయంలో స్థానిక ప్రజలు, రైతులు, గిరిజనులు సహకరించడానికి ప్రధాన కారణం తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకమేనని గుర్తు చేశారు. భూ సేకరణలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని, ఒక్క గిరిజన రైతుకు కూడా అన్యాయం జరగకుండా చూసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హడావుడిగా కేవలం కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. ఇంకా సుమారు 700 మంది భూ నిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, వారి న్యాయమైన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. కుటుంబంలో మగవారు లేని సందర్భాల్లో ఆడపిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అంతేకాకుండా దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని బేఖాతరు చేసి అర్హులైన యువతులను పక్కన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, భూ నిర్వాసితుల ఆశలను అడియాశలు చేసి ఇప్పుడు ప్రైవేటీకరణ పేరుతో వారి భవిష్యత్ను మరింత అంధకారంలోకి నెడుతోందని ధ్వజమెత్తారు. యదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని, భూ నిర్వాసిత కుటుంబాల హక్కులు కాలరాయబడతాయని హెచ్చరించారు. ప్రజా ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. యదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, మిగిలిన 700 మంది భూ నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల హక్కులు, ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమిస్తుందని భాస్కర్ రావు హెచ్చరించారు.