నల్లగొండ సిటీ, ఏప్రిల్ 11 : భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణ తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దకే అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. భద్రాచలం వెళ్లలేని భక్తులు కోరుకున్న ప్రాంతానికి ప్యాకెట్లను ఇచ్చేలా చర్చలు చేపట్టింది. ఆర్టీసీ లాజిస్టిక్ సేవల ద్వారా గతం కంటే ఈ సారి ఎక్కువ మందికి తలంబ్రాలు అందజేయాలని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 17నుంచి బుకింగ్స్ ఇవ్వనున్నారు. కావాల్సిన వారు రూ.151 చెల్లించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని లాజిస్టిక్ సెంటర్లలో ఈ నెల 18 వరకు ముందస్తు బుకింగ్స్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
రాములవారి కళ్యాణం అనంతరం బుకింగ్ చేసుకున్న వారికి తలంబ్రాలను ఇంటి వద్దకే సరఫరా చేస్తారు. సీతారాముల వారి ముత్యాల తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ తలంబ్రాలను శుభకార్యాలకు అక్షింతలుగా వాడితే రాములవారి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం. రైతులు తమ వ్యవసాయ పనులు మొదలు పెట్టే ముందు పొలాల్లో వీటిని చల్లుతారు. గత ఏడాది ఒక్కో ప్యాకెట్కు రూ.116 ఉండగా, ఈ సారి ఆ ధరను రూ.151కి పెంచింది.
భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులు పవిత్రంగా భావిస్తారు. అక్కడికి వెళ్లలేని భక్తులకు ఇంటి వద్దే అందించేందుకు ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్లలో బుకింగ్స్ ప్రారంభించాం. బుకింగ్స్ చేసుకున్న వారికి సీతారాముల కళ్యాణం అనంతరం వారి ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. బుకింగ్స్ చేసుకునే భక్తులు తమ ఇంటి చిరునామాతోపాటు ఫోన్ నెంబర్ ఇవ్వాలి. సీతారాముల కళ్యాణ తలంబ్రాల పంపిణీని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం