మరో మూడు వారాల్లో వానకాలం సాగు ప్రారంభంకానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతన్నలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లో గుర్తింపు లేని, నకిలీ విత్తనాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. నల్లగొండ మండలంతోపాటు జిల్లాలో పత్తి విస్తీర్ణం పెరుగడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తోపాటు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుండడంతో వరి సాగు సైతం భారీగా పెరిగింది. ఈ క్రమంలో నకిలీలను అరికట్టేందుకు విత్తన ప్యాకెట్లపై ప్రభుత్వ నిబంధనలు, వివరాలను సరిచూసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని నల్లగొండ మండల వ్యవసాయాధికారి సుమన్రామన్ సూచిస్తున్నారు.
– నల్లగొండ రూరల్, మే 11
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి. రసీదుపై నంబర్, విత్తన రకం, కొనుగోలు తేదీ, డీలర్ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. గడువు దాటిన విత్తనాలు, చిరిగిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి ఇచ్చే ప్యాకెట్లను కొనుగొలు చేయవద్దు. రసీదుపై విక్రయదారుడి పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేల్స్ ట్యాక్స్ నంబర్లు, విక్రయదారుడి గ్రామం, పేరు, సంతకం, తేదీలు, రకాలు, బ్యాచ్ నంబర్, గడువు తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు నమోదై ఉండాలి. కొనుగోలు చేసిన సరుకు డీలర్ వద్ద తూకం వేయించాలి.
మొలకెత్తే, పూత దశల్లో పంటలో లోపం కనిపిస్తే వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను సంప్రదించాలి. విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో పొందిన రసీదును పంటకాలం పూర్తయ్యే వరకూ జాగ్రత్తగా ఉంచుకోవాలి. పంటలో చీడ పీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పురుగు మందులనే కొనుగోలు చేయాలి. అవసరానికి మించి కొనుగోలు చేసిన మందులు నిల్వ ఉంచి వాడొద్దు. పురుగు మందు డబ్బాలపై చక్రాకారంలో పురుగు మందు స్థాయి తెలిపే రంగులు ఉంటాయి. అత్యంత విషపూరితమైతే నీలం రంగు, స్వల్ప విషపూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తులు ఉంటాయి. ఒక పంటకు వాడిన పురుగు మందును మరో పంటకు వాడే విషయంలో శాస్త్రవేత్తల సూచలు
కల్తీలను గుర్తించడం ఇలా..
యూరియా, కాల్షియం, అమ్మోనియం, నైట్రేట్ వంటి ఎరువుల గుళికలు రూపంలో ఉంటాయి. ఎరువులు ఇసుక రేణువుల రూపంలో ఉంటాయి. పొటాష్, సూపర్ ఫాస్పేట్ పొడి రూపంలో ఉంటాయి. 5 మిల్లీ లీటర్ల నీటిలో చెంచా ఎరువును వేసి బాగా కలపాలి. ఇది స్వచ్ఛమైన ద్రావణంగా తయారైతే నాణ్యమైన ఎరువుగా గుర్తించవచ్చు. యూరియా, అమ్మోనియం క్లోరైడ్ ఎరువుల పరీక్షకు 10 మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిని వినియోగించుకోవాలి. యూరియా ఒక చెంచా ఐదు మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిలో వేసి బాగా కలిపితే అడుగున మట్టి చేరితే కల్తీగా గుర్తించవచ్చు. కొన్ని కాంప్లెక్స్ ఎరువులను ఇదే పద్ధతిలో పరీక్షిస్తే ఇసుక రేణువులు వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చినా కల్తీ ఎరువుగానే గుర్తించాలి.
నాణ్యతా ప్రమాణాలు పరిశీలించాలి
దిగుబడి బాగా వస్తుందని, ఎవరో చెప్పారని మార్కెట్లో తక్కువ ధరకు విత్తనాలు దొరుకుతున్నాయని చూడొద్దు. నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలి. వివిధ కంపెనీల ప్రకటనలకు మోసపోవద్దు. ప్రైవేట్ కంపెనీలు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రమాదముందనే విషయాన్ని గ్రహించాలి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ద్వారా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. నకిలీ విత్తనాలు, ఎరువులు ఎక్కడైనా అమ్మినట్లు తెలిస్తే వెంటనే వ్యవసాయాధికారులు, పోలీసులకు సమాచారం అందించాలి.
-సుమన్ రామన్, ఏఓ, నల్లగొండ