సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 30 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి రూ.517 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 2న రూ.118కోట్లతో చేపట్టిన ఎస్టీపీ ప్లాంట్ను, రూ.2కోట్లతో చేపట్టిన ఈఎస్టీపీ ప్లాంట్, ఐటీ హబ్ను ప్రారంభించడంతోపాటు రూ.316కోట్లతో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను, రూ.30కోట్లతో నిర్మించే కాల్వలు, సీసీ డ్రైనేజీ పనులు, రూ.4కోట్లతో చేపట్టనున్న ఇతర పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సూర్యాపేటకు వచ్చి మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభించారన్నారు. కొద్ది రోజులకే మంత్రి కేటీఆర్ వచ్చి మిగిలిన కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉన్నదని తెలిపారు. 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని మంత్రి జగదీశ్రెడ్డి తొమ్మిదిన్నరేండ్లలోనే చేసి చూపించారని అన్నారు. రెండు సార్లు ఓటు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు రూ.7వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. అక్టోబర్ 2న ఉదయం 11గంటలకు జిల్లాకు రానున్న మంత్రి కేటీఆర్కు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల అనంతరం పార్టీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పారు. మంత్రి కేటీఆర్ పర్యటనపై విస్తృత ప్రచారం చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములై రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి, జగదీశ్రెడ్డి మంత్రి అవుతారని, మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులుగౌడ్, నాయకులు గోవర్ధన్, నాగయ్య, రాపర్తి శ్రీనివాస్, ఆనంద్ పాల్గొన్నారు.