నల్లగొండ రూరల్, మార్చి 26 : సీఎం కేసీఆర్ దార్శనికతతోనే గ్రామాల్లో త్వరితగతిన అభివృద్ధి సాధ్యమైందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ జాతీయ పంచాయతీ పురస్కారాలకు ఎంపికైన ఉమ్మడి జిల్లా పంచాయతీలకు నల్లగొండ జిల్లా కేంద్రంలో అవార్డుల ప్రదానం చేశారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారం అందుకోవడం వెనుక సర్పంచుల శ్రమ దాగి ఉన్నదని, దీనికి తోడు పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో ఉన్నందునే గ్రామా ల్లో పురోగతి సాధ్యమైందని ఆయన చెప్పారు.
దేశంలో లక్షా 50 వేల గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వం 20 అవార్డులు ప్రకటిస్తే తెలంగాణలోనే 19 పంచాయతీలు ఉండడం గర్వకారణం అన్నారు. గతంలో లేని విధంగా పంచాయతీల్లో అభివృద్ధ్ది జరిగిందన్నారు. ఈ దఫా సర్పంచులుగా గెలిచి సేవలు అందించిన వారు అదృష్టవంతులు అని మంత్రి అభివర్ణించారు. సర్పంచులుగా ఎన్నిక కాక ముందు ఆయా గ్రామాల పరిస్థితులు తాజాగా ఉన్న పరిస్థితులు అన్వయించుకుంటే అభివృద్ధిలో వచ్చిన మార్పు తేలిపోతుందన్నారు.
నిధులు రావడం లేదంటూ అసత్య ప్రచారం
కొందరు చిల్లర నాయకులు పంచాయతీలకు నిధులు రావడం లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి అన్నారు. ఎంపిక చేసిన 9 అంశాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు పురస్కారాలు జిల్లాకు 27 చొప్పున నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులకు 81 అవార్డులు అందజేసి శాలువా, మెమొంటో, ప్రశంసా పత్రాలతో మంత్రి సన్మానించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్లు బండ నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, గుజ్జ దీపికాయుగేంధర్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, రవీంద్రకుమార్, భాస్కర్రావు, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కలెక్టర్లు వినయ్ క్రిష్ణారెడ్డి, వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు ఖుష్బూగుప్తా, పాటిల్ హేమంత్ కేశవ్, దీపక్ తివారీ, జిల్లా పంచాయతీ అధికారులు, ఆర్డీఓలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీడీఓలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.