రామగిరి, నవంబర్ 25 : దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభల సందర్భంగా నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో రెండ్రోజులపాటు నిర్వహించే ప్రజానాట్యమండలి రాష్ట్ర 4వ వీధి నాటకోత్సవాలు శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డితో కలిసి కళాకారుడు సఫ్దర్ హష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డోలు వాయించి వీధి నాటకోత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు సీపీఎం జిల్లా కార్యాలయం నుంచి ఎన్జీ కళాశాల మైదానం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక కేంద్ర సర్కార్ను గద్దె దించేందుకు వామపక్ష పార్టీలతోపాటు కలిసి వచ్చే అందరినీ కలుపుకొని ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు.
ప్రజానాట్యమండలి కృషికి తన వంతుగా సహకారం అందిస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న మోదీ ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రజా వ్యతిరేక పాలన, రైతుల సమస్యలు, తదితర అంశాలపై ఈ నెల 27నుంచి 29వరకు నల్లగొండలో జరిగే రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో పలు తీర్మానాలు చేస్తామన్నారు.
తొలి రోజు ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, సీపీఎం నాయకులు సయ్యద్ హాషం, పాలడుగు నాగార్జున, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, ప్రజానాట్యమండలి నాయకులు కుమ్మరి శంకర్, చంద్రమౌళి, పరిశోధకురాలు అనిత, వేముల సదానందం, కళాకారులు పాల్గొన్నారు.
ప్రజానాట్యమండలి కళాకారుల నాటక ప్రదర్శనలు ఆలోచింపజేయడంతోపాటు ఆకట్టుకున్నాయి. డప్పుల విన్యాసాలతోపాటు హైదరాబాద్ కళాకారులు ప్రదర్శించిన హల్లాబోల్ నాటకం, ఎస్కే బషీర్ బృందం ప్రదర్శించిన డెమోక్రసీ, నల్లగొండ జిల్లా కళాకారుల రైతు బతుకు ఒగ్గుకథ, వీర తెలంగాణ నాటకం, రంగారెడ్డి జిల్లా కళాకారుల చిరుతల కథ, భువనగిరి కళాకారుల గోసంగి నాటకం ఆలోచింపజేశాయి.