వానకాలం పంటల సాగుపై రైతులకు అవగాహన
16 నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ లాభదాయక
పంటల విస్తీర్ణం పెంపుపై ప్రధాన దృష్టి
ప్రతి ఏఈఓ పరిధిలో 155 మంది రైతులు
ఇతర పంటలవైపు ప్రోత్సహించేందుకు ప్రాధాన్యం
కొత్త వెరైటీతో పత్తి సాగు పెరుగుతుందని అంచనా
రైతుకు దన్నుగా వానకాలం సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. రైతులు ఏ పంటలు వేసేందుకు ఆసక్తిగా ఉన్నారు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు ఏవి, ఏ పంట వేస్తే ఎంత ఆమ్దానీ వస్తుంది, సాగుకు అవసరమైన యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్న ఆదేశాలతో వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే దిశగా రైతులను చైతన్యం చేయనున్నది. ఆ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్లస్టర్ల పరిధిలో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ) ఈ నెల 16 నుంచి సదస్సులు నిర్వహించనున్నారు. ప్రతి ఏఈఓ 155 మంది రైతులను ఎంపిక చేసుకుని కనీసం 400 ఎకరాలు లక్ష్యంగా అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. పత్తి, కంది, పెసర వంటి ఇతర పంటలు గతం కంటే 10 నుంచి 20శాతం అదనంగా సాగు చేసేలా ప్రోత్సహించనున్నారు.
నల్లగొండ, జూన్ 4 : వానకాలం సీజన్లో రైతులు సాగు చేసే పంటలపై వారికి అవగాహన కల్పించేందుకు వ్యవసాయ యంత్రాంగం సదస్సులు నిర్వహించనున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 314 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా ప్రతి క్లస్టర్లో ఉన్న ఏఈఓలు స్థానిక యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ నెల 16 నుంచి రైతువేదికలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ప్రతి ఏఈఓ 155 మంది రైతులను ఎంపిక చేసుకొని కనీసం 400 ఎకరాల్లో వారు వేసే పంటలను తెలుసుకొని ఆయా భూముల్లో వేసే పంటలకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. యాజమాన్య పద్ధతుల్లో భాగంగా తొలుత సబ్సిడీలో పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయించి భూసారం పెరిగేలా చూస్తారు. తర్వాత వరి అయితే డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతిపై, పత్తి అయితే వినూత్న పద్ధతుల్లో సాగుపై అవగాహన కల్పించడంతో పాటు ఎరువుల వినయోగంపై వివరించనున్నారు.
లాభసాటి పంటలపైనే ప్రధాన దృష్టి
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం ఉన్న పంటలు సాగుచేసేలా వ్యవసాయ యంత్రాంగం ప్రణాలికలు రూపొందిస్తున్నది. వరి సాగు చేస్తే ఎకరాకు 30 క్వింటాకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ధాన్యం క్వింటాకు రెండువేల చొప్పున విక్రయించినా రూ. 60వేలు మాత్రమే వస్తాయి. ఇందులో ఖర్చులు పోనూ రూ. 20వేలు కూడా రావడం లేదు. ఇలా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తే రైతులు నష్టపోతున్నందున ప్రత్యామ్నాయ పంటల సాగుతో లాభం వస్తుందనే విషయాన్ని అధికారులు రైతులకు వివరిస్తారు. పత్తి ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా లక్ష రూపాయల వరకు చేతికందుతున్నాయి. ఖర్చులు పోను రూ.50వేల వరకు మిగలనున్నాయి. పత్తితో పాటు కంది, పెసర, ఉద్యాన పంటల ద్వారా వచ్చే లాభాలపై సదస్సుల్లో రైతులకు వివరించనున్నారు.
ఇతర పంటల సాగు పెంపే లక్ష్యం
గత వానకాలం సీజన్లో ఏయే పంటలు ఎంత మేర వేశారనే వివరాలు తీసుకొని ఈ సారి 10 నుంచి 20 శాతం ఇతర పంటల సాగు పెంచడమే లక్ష్యంగా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నల్లగొండ జిల్లాలో గత సీజన్లో పత్తి 6.50 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఈ సారి 7.30 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంది 10 వేల ఎకరాల్లో సాగు చేయించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఎక్కువ మంది రైతులను ఉద్యాన పంటల సాగు మళ్ల్లించేలా ఉద్యానవన శాఖ చర్యలు చేపట్టనున్నది. ఇందులో భాగంగా ఆయిల్ పామ్తో అధిక లాభాలు రావడం.. దానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ అందిస్తుండడంతో ఈ పంటల సాగు పెంచేందుకు ఆశాఖ ప్రయత్నాలు చేస్తున్నది. పైగా మార్కెటింగ్ సైతం కంపెనీలే చేస్తున్న తరుణంలో రైతులను ఆ దిశగా మళ్లిస్తున్నారు.
పత్తిలో కొత్త రకం విత్తనాలు
పత్తి ఏరటానికి కూలీల కొరత కారణంగా చాలా మంది రైతులు వరి సాగు వైపు మళ్లారు. సాధారణంగా ఈ పంట దసరా సీజన్లో వస్తున్నది. ఆ సమయంలో తుపాన్లు వచ్చే అవకాశం ఉండగా పత్తి తడిస్తే చేతికి రావటం కష్టం. పైగా మూడు సార్లు ఏరడానికి కూలీలు దొరక్క పోవడంతో రైతులు ఇతర పంటల వైపు మళ్లారు. ప్రభుత్వం ఈసారి కొన్ని కంపెనీలతో ప్రయోగాలు చేయించి పంట మొత్తం ఒకే సారి చేతికందేలా కొత్త రకాలను అందుబాటులోకి తెచ్చింది. గతంలో మూడు సార్లు ఏరితే ఎంత దిగుబడి వచ్చేదో ఈ రకం విత్తనం వల్ల ఒకే సారి ఏరినా అంతే దిగుబడి వస్తుంది. దాంతో పాటు కూలీలతో సంబంధం లేకుండా సదరు కంపెనీలే మిషన్ల ద్వారా పత్తి ఏరే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి నల్లగొండ జిల్లాలో ఏడు వేల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 5,500, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3,500 ఎకరాల్లో ఈ రకం పత్తి సాగు చేయించేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోంది. ఎకరాకు ఐదు ప్యాకెట్లు అవసరమై ఉండగా మూడు ప్యాకెట్ల డబ్బులు ప్రభుత్వమే అందించనున్నది.
ప్రతి క్లస్టర్లో నిర్వహిస్తాం
వానకాలం సాగు విధా నంపై రైతులకు అవగాహన కల్పించడం లాభసాటి పంటలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా చూడడం లక్ష్యంగా ప్రతి వ్యవసాయ క్లస్టర్లో అవగాహన సదస్సులు నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పల్లె ప్రగతి పూర్తి కాగానే సదస్సులు మొదలు పెడతాం. గత సీజన్లో వేసిన ఇతర పంటల శాతం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఈ సారి పత్తి పంటలో కొత్త వెరైటీ విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చాం. జిల్లా వ్యాప్తంగా ఏడు వేల ఎకరాల్లో ఈ విత్తనాలను సాగు చేయించడంతో పాటు రైతులకు మూడు ప్యాకెట్లు ఉచితంగా ఇస్తాం. కంపెనీల సహకారంతో ఒకేసారి మిషన్ ద్వారా పత్తి ఏరే విధంగా చర్యలు చేపడతాం.
–సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ