హాలియా, ఆగస్టు 31 : రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన అభినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నల్లగొండ జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు అన్నారు. గురువారం హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ మాదిగ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా నేటికి దేశంలో దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. కానీ తెలంగాణలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. దళిత బంధు పథకం తీసుకొచ్చి ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారని కొనియాడారు. దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడంతో పాటు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయమన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్కు మాదిగలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు.
గతంలో ఇక్కడ జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా పని చేసినా దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన దాఖలాలు లేవని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పెత్తందారుల రాజ్యం వస్తుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే మాదిగలు ఆత్మగౌవరంతో జీవిస్తారని చెప్పారు. అనంతరం నోముల భగత్కుమార్కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఏకగీవ్ర తీర్మాణం చేశారు. సమావేశంలో హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆడెపు రామలింగయ్య, సర్పంచుల ఫోరం నిడమనూరు మండలాధ్యక్షుడు పోడె డేవిడ్, దళిత బంధు జిల్లా కమిటీ సభ్యుడు మడుపు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు పెద్దమూము కాశయ్య, యాదయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పోలేని ముత్యాలు, తరి వెంకటయ్య, శ్రీరాంపల్లి సర్పంచ్ ఇస్త్రం నగేశ్, చిలుకాపురం సర్పంచ్ తుడుం ముత్తయ్య, పోతెపాక సైదులు, అవిరెళ్ల సైదులు, బొంగరాల శ్రీనయ్య, దైద రవి, లింగాల సైదులు, సింగిల్ విండో డైరెక్టర్ గెంటెకంపు వెంకటయ్య, దోరేపల్లి వెంకన్న, బందిలి సైదులు, యడవల్లి రాంబాబు, మొగలయ్య పాల్గొన్నారు.