సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ప్రగతి పరుగులు
సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు
నెల్లికల్లు ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.692 కోట్లు
సీఎం ప్రత్యేక నిధి నుంచి రూ.150 కోట్లు
ప్రతి గ్రామపంచాయతీకి రూ.20 లక్షల చొప్పున రూ.40కోట్లు
రోడ్లు, రహదారులు, వంతెనలకు రూ.20 కోట్లు
ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి రూ.12 కోట్లు
చెక్డ్యామ్ల నిర్మాణం కోసం రూ.20 కోట్లు
మున్సిపాలిటీల్లో తాగునీటికి రూ.59కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.200 కోట్లు
సీఎంఆర్ఎఫ్ కింద 850 మందికి రూ.3కోట్లు
హాలియా, మే 13 : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధుల వరద పారిస్తూ అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం సుమారు రూ.వెయ్యి కోట్లు కేటాయించి స్పష్టమైన మార్పును కళ్లకు కడుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో నాలుగు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయి. ఇప్పటికే హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కాగా, నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెల్లికల్లు లిప్ట్ పనులు సైతం ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పాటైన హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ యార్డు, ఆడిటోరియం, డిజిటల్ లైబ్రరీ, వైకుంఠధామంతో పాటు ఇంటింటికీ తాగునీటి సౌకర్యం, రోడ్లను విస్తరణ పనులు చేపట్టారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు…
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాలియా ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య విజ్ఞప్తి మేరకు పచ్చజెండా ఊపిన సీఎం కేసీఆర్.. ఉప ఎన్నికల సందర్భంగా హాలియాకు డిగ్రీ కళాశాలను మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ కళాశాలలో 200 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది వీరంతా డిగ్రీ ఫస్ట్ ఇయర్ దిగ్విజయంగా పూర్తి చేశారు.
గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రగతి జోరు
నియోజకవర్గంలో హాలియా, నందికొండ మున్సిపాలిటీలతో పాటు 189 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.40కోట్లు విడుదల చేయడంతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రగతి పనులు జోరందుకున్నాయి. అభివృద్ధి పనులతో గ్రామాలు, మున్సిపాలిటీలు కొత్తశోభను సంతరించుకున్నాయి.
రోడ్లు, రహదారులు, వంతెనల నిర్మాణం, మరమ్మతు…
గ్రామీణ రహదారులకు మహర్దశ లభించింది. నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతు, వంతెనల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20కోట్లు విడుదల చేసింది. నిడమనూరు మండలం మారుపాక, గోవిందమ్మగూడెం మధ్య కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంతకాలం గుంతల మయమైన పలు గ్రామీణ రహదారులు నూతన శోభను సంతరించుకున్నాయి.
సంక్షేమ కార్యక్రమాలు….
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రూ.200 కోట్ల చెక్కుల పంపిణీ…పేదింటి ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కారాదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వేలాది మందికి భరోసా అందించాయి. సాగర్ నియోజకవర్గంలో ఏడాది కాలంలో సుమారు 2వేల మందికి పైగా రూ.200కోట్లు మంజూరయ్యాయి.
సీఎం సహాయనిధితో అండగా..
ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకున్న పేదలు అప్పుల పాలు కారాదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నాయి. ఏడాది వ్యవధిలో నియోజకవర్గ వ్యాప్తంగా 825 మందికి రూ.3 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పంపిణీ చేశారు.
ఇక్కడే చదువడం ఆనందంగా ఉంది…
మాది అడవిదేవులపల్లి మండలం. మా నాన్న 15సంవత్సరాల కిందట బతుకుదెరువు కోసం హాలియాకు వచ్చాడు. కూరగాయల వ్యాపారం మా కుటుంబానికి ఆధారం. ప్రభుత్వం హాలియాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల నేను ఇక్కడే చదువుకోవడానికి వీలు కల్గింది. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోతే నేను చదువు ఆపేయాల్సి వచ్చేది. కళాశాల ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– గుండెబోయిన భాస్కర్, డిగ్రీ విద్యార్థి, హాలియా
మున్సిపాలిటీల్లో తాగునీటి సౌకర్యం…
హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం కోసం అమృత్ పథకం కింద రూ.59కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం..
మిషన్ భగీరథ కార్యక్రమం ప్రతి ఇంటికీ రక్షిత జలాలు సరఫరా అవుతున్నాయి. ఆ మేరకు రూ.12కోట్లతో 32 ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించారు. నెలాఖరులోగా ట్యాంకులను ప్రారంభించే అవకాశాలున్నాయి.
చెక్ డ్యామ్ల నిర్మాణం…
టెయిలెండ్ భూములకు నీరందించాలనే లక్ష్యంతో భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రూ.20కోట్ల వ్యయంతో చెక్డ్యామ్ల పనులు చకచకా సాగుతున్నాయి. పులిమామిడి చెక్డ్యాం ఈనెలాఖరుకల్లా పూర్తి కానున్నది. రామడుగు, ఇతర చెక్డ్యాం పనులు సగానికి పైగా పూర్తయ్యాయి.
నెల్లికల్లు లిప్ట్ పనులు చకచకా…
తిరుమలగిరి సాగర్ మండలంలో బీడు భూములకు సాగునీరందించాలనే లక్ష్యంతో రూ.692 కోట్లతో చేపట్టిన నెల్లికల్లు లిప్ట్ పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం లిప్ట్ పంప్హౌస్ ఎర్త్ వర్క్స్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఏడాదిలోగా పనులు పూర్తి చేసి తాగు, సాగునీరందించాలనే లక్ష్యంతో అధికారులు కృషి చేస్తున్నారు. నెల్లికల్లు లిప్ట్ నిర్మాణం పూరై అందుబాటులోకి వస్తే రూ.24,886 ఎకరాలకు నీరందుతుంది. గతేడాది ఆగస్టులో హాలియాలో నిర్వహించిన నియోజకవర్గ ప్రగతి సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించి రూ.150కోట్లు విడుదల చేశారు. ఆయా నిధులతో చేపట్టాల్సిన పనులను అధికారులు గుర్తించగా రూ.50కోట్ల విలువైన పనులకు మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభోత్సవం చేయనున్నారు.
సమగ్రాభివృద్ధే లక్ష్యం..
నాగార్జునసాగర్ నియోజకవర్గాభివృద్ధే నా లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాను. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడంతో పాటు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాం. గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి ఇతర పార్టీ, ప్రభుత్వ పెద్దల సహకారంతో నియోజకవర్గంలో సుమారు రూ.1000 కోట్ల విలువైన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ప్రభుత్వ పెద్దల తోడ్పాటు, ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలన్నదే నా అభిమతం.
– నోముల భగత్ కుమార్, ఎమ్మెల్యే