మాదాపూర్, ఆగస్టు 11: పోక్సో కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ సస్పెండెడ్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్రెడ్డి అరెస్టులో మాదాపూర్ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు అందుబాటులో ఉన్నప్పటికీ, కేసు నమోదై 20 రోజులు గడుస్తున్నప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై బాధిత కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసున్నది. వివరాల్లోకి వెళ్తే.. గతనెల 24న మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పృథ్వీశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది.
అయితే పోలీసులు అతడిని అరెస్ట్ చేయకుండా బీఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీచేసి వదిలేశారని సమాచారం. ఈ క్రమంలో నిందితుడు ఈనెల 3న రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్ విచారణకు వచ్చినట్లు తెలిసింది. పోక్సో కేసు నమోదైనప్పటికి నిందితుడు స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఇటీవల ఒక క్రీడా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
తమకు నిందితుడి వల్ల ఎలాంటి హని జరిగినా దానికి పోలీసులే బాధ్యత వహించాలని బాధిత కుటుంబం స్పష్టం చేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మాదాపూర్ ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావును పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాన్ని అడిగితే.. 7 ఏండ్ల కంటే తక్కువ శిక్షపడే కేసులో అరెస్ట్ చేసి కోర్టుకు పంపలేమని, నోటీసు ఇవ్వడం కూడా అరెస్ట్ చేసినట్లే పరిగణించబడుతుందని చెప్పడం గమనార్హం.