నల్లగొండ ప్రతినిధి, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో వ్యవసాయ సీజన్ మొదలైందంటే ఎరువులు, విత్తనాల కొరత తీవ్రంగా ఉండేది. సరైన ప్రణాళిక కొరవడి సకాలంలో ఎరువులు తెప్పించకపోవడంతో రైతులు అవస్థ పడేవారు. చెప్పులను క్యూలైన్లలో పెట్టి పొద్దంతా పడిగాపులు కాస్తే, అరకొరగా దొరికేవి. దాంతో రైతుల ధర్నాలు, నిరసనలు సర్వసాధారణంగా జరిగేవి. స్వరాష్ట్రంలో ఆ సమస్యలన్నీ పోయాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పక్కాగా వ్యవసాయ ప్రణాళిక అమలవుతున్నది. దానికి అనుగుణంగా సీజన్కు ముందే ఎరువులు, విత్తనాలను తెప్పిస్తున్నారు. ప్రస్తుత వానకాలం సీజన్లో పంటల సాగు ఊపందుకుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మెట్ట ప్రాంతాల్లో పత్తి విత్తనాలు వేస్తుండగా నాన్ఆయకట్టులో బోర్లు, బావుల కింద వరినాట్లకు సిద్ధమవుతున్నారు. ఎక్కడా విత్తనాలు, ఎరువులు కొరత అనే సమస్య రాలేదు. రైతన్నకు దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చేపడుతున్న చర్యలే ఇందుకు దోహదపడ్డాయి.
నల్లగొండ జిల్లాలో ఈ వానకాలం సీజన్లో సాగు ప్రణాళిక ప్రకారం అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 11,93,000 ఎకరాల్లో సాగవుతాయని అంచనా. ఇందులో పత్తి 6.50 లక్షల ఎకరాల్లో, వరి 5.25 లక్షలు, కందులు 10వేలు, వేరుశనగ 3వేలు, పప్పు దినుసులు 2వేలు, ఇతర పంటలన్నీ కలిపి మరో 3వేల ఎకరాల్లో సాగు కావచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ పంటల సాగుకు అనుగుణంగా అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఈ సీజన్కు జిల్లాలో యూరియా 80,108 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం 32వేల మెట్రిక్ టన్నులు మార్కెట్లో ఉన్నది. డీఏపీ 14,377 మెట్రిక్ టన్నులు అవసరముండగా, 5300 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నది. ఎంఓపీ 11,745 మెట్రిక్ టన్నులకుగాను 1200 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,09,379 మెట్రిక్ టన్నులు అవసరముండగా 27వేల మెట్రిక్ టన్నులు జిల్లాలో అందుబాటులో ఉన్నది. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో వారం రోజులుగా రైతులు ఎరువుల కొనుగోళ్లకు ఉపక్రమించారు. ఇప్పటికే రైతులు ఒక దఫా కొనుగోలు చేశారు. కొనుగోళ్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎరువులను జిల్లాకు తెప్పిస్తున్నారు. దాంతో ఎరువుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు. పంటల సాగుకు అనుగుణంగా అవసరాలను బట్టి మిగతా ఎరువులను విడుతల వారీగా జిల్లాకు తెప్పించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి సుచరిత వెల్లడించారు.
కేంద్రం ధరల మోత
రాష్ట్ర సర్కారు రైతన్నకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎరువుల ధరలను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నది. రైతులు ఎక్కువగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో బస్తాపై ఏడాదిలోనే కనీసం 50 నుంచి 70శాతం వరకు ధరలు పెరిగాయంటే భారం ఏ మేరకు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో రైతుపై సగటున ఒక పంటకు ఏడాదికి రెండు నుంచి మూడు వేల వరకు అదనపు భారం పడుతుందని అంచనా. 14-35-14 రకం ఎరువు ధర 2022 యాసంగిలో 1,275 రూపాయలు ఉండగా, ప్రస్తుతం రూ.1500కు చేరింది. 28-28-0 రకం ధర రూ.1275 నుంచి రూ.1900కు పెరిగింది. 24-24-0-8 రకం 1200 నుంచి రూ.1800కు పెరిగింది. 20-20-0-13 రకం కాంప్లెక్స్ ఎరువు ధర రూ.950 నుంచి 1325 రూపాయలకు పెరిగింది. పొటాష్ ధర 2022 యాసంగిలో రూ.950 ఉండగా, నేడు ఏకంగా 1700 రూపాయలకు చేరింది. అంటే 90శాతం ధర పెరిగినట్లు స్పష్టమవుతున్నది. 2022 యాసంగి తర్వాత అదే ఏడాది వానకాలంలోనూ ధరలు పెరిగాయి. తిరిగి ఈ ఏడాది జనవరిలోనూ మరోసారి పెరిగాయి. వరుసగా మూడు సీజన్లలో ఎరువుల ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం రైతులపై భారం మోపింది. ప్రస్తుత వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లాలో ఎరువుల భారం అదనంగా రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు వంటి ఫథకాలతో సీజన్కు ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతు జేబును కొల్లగొడుతున్నదని రైతులు మండిపడుతున్నారు.
సమైక్య పాలనలో ఆగమాగం
సమైక్య రాష్ట్రంలో సీజన్ ప్రారంభంలో ఎన్నో సమస్యలు చుట్టుముట్టేవి. ఎరువులు, విత్తనాల కొరత తీవ్రంగా వేధించేది. నాణ్యమైన విత్తనాలు దొరక్కపోవడం ఒక సమస్య ఎరువులు కూడా దొరికేవి కావు. దాంతో రైతులు సాగు పనులు వదిలి ఎరువుల కోసం మండల కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు కాసేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడి క్యూలో నిల్చుంటే కూడా ఒక్కో రోజు ఒక్క బస్తా ఎరువు కూడా లభించేది కాదు. ఉమ్మడి జిల్లా అంతటా నిత్యం ఎరువుల కోసం చెప్పులతో క్యూలైన్లు దర్శనమిచ్చేవి. దాంతో విసిగివేసారిన రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేసేవాళ్లు. సీజన్ ఆరంభంలో ఎరువుల కోసం వచ్చిన రైతుల ఆందోళనలతో నల్లగొండ క్లాక్టవర్ సెంటర్ నిత్యం దద్దరిల్లిపోయేది. కొన్నిసార్లు రైతులు పోలీసుల లాఠీచార్జీకి గురికావడంతోపాటు కేసుల పాలయ్యేవారు. ఒకటి రెండు సందర్భాల్లో కడుపుమండిన రైతులు ఎరువుల లారీలను లూఠీ చేసిన సందర్భాలు ఉన్నాయి. లారీ లోడ్ వస్తే పోలీసు బందోబస్తు నడుమ ఎరువులు అందజేసిన సందర్భాలు కోకొల్లలు. అయితే.. స్వరాష్ట్రంలో ఎరువుల విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నారు. ఎరువుల కొరత అనేది లేకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. పంటల దిగుబడిలో అద్భుతాలు సాధిస్తున్నారు.
ఇప్పుడు పండుగలా వ్యవసాయం
గత ప్రభుత్వాల హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసేది. అయినా దొరకక నిరాశతో ఇంటిబాట పట్టేది. ప్రస్తుతం ఏ సమయంలోనైనా ఎరువులు పుష్కలంగా దొరుకుతున్నాయి. ముందుగా పెట్టుబడి సాయం ఇస్తుండడంతో ఎరువులు, విత్తనాల కోసం అప్పులు తెచ్చే తిప్పలు కూడా తప్పాయి. అప్పటికి, ఇప్పటికి చాలా తేడా ఉంది. గత ప్రభుత్వాల హయాంలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వ్యవసాయం ఉండేది. నాట్లు వేసే ముందు విత్తనాలు, అడుగుమందు బస్తాలు దొరకబట్టడం ఇబ్బందిగా ఉండేది. యూరియా కొరత తీవ్రంగా ఉండేది. ఆ కష్టాలు పడలేక వ్యవసాయం మానేసి కౌలుకు ఇచ్చి ఇతర పనులకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వ్యవసాయం పండుగలా ఉన్నది. – ఎం.కోటయ్య, రైతు, మూసీఒడ్డు సింగారం, పాలకవీడు మండలం
రైతుల కళ్లల్లో నాడు ఆందోళన.. నేడు ఆనందం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు సీజన్ వచ్చిందంటే రైతుల కళ్లల్లో ఆందోళన కనిపించేది. ఎరువులు, విత్తనాల కోసం కాళ్లకు చక్రాలు కట్టుకొని దుకాణాల వెంట తిరిగేది. గంటల తరబడి క్యూలో నిలుచున్నా ఎరువులు, విత్తనాలు దొరికేవి కాదు. మాకు కూడా సరఫరా లేకపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులకు సమాధానం చెప్పలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. నేడు ఆ పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా మార్చేసిండు. సీజన్ మొదలు కావడానికి ముందే ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. అన్ని దుకాణాల్లో కావాల్సిన రకాల ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. నిన్న మొన్న రైతుబంధు డబ్బులు జమ చేయడంతో రైతులు తమకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– కొత్తపల్లి ప్రభాకర్రెడ్డి, ఫర్టిలైజర్ దుకాణ యజమాని, సూర్యాపేట
రైతు బంధుతో పెట్టుబడి తిప్పలు తప్పినయ్
రైతుబంధు పథకంతో రైతులకు పెట్టుబడి సాయం అందించడం చాలా సంతోషంగా ఉన్నది. నాకున్న రెండెకరాల భూమికి సర్కారు ఏటా మొదటి విడుతలో రూ.5వేలు, రెండో విడుతలో మరో రూ.5వేలు ఇస్తున్నది. సాగుకు ముందే సర్కారు సాయం చేస్తుండడంతో ఎరువులు, విత్తనాలు కొనేందుకు తిప్పలు తప్పినయ్. గతంలో పంటల పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగేవాళ్లం. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక పెట్టుబడి కోసం పైసలు ఇవ్వడంతో మా లాంటి పేద రైతుల బాధలు తప్పినయ్. రైతుబంధు పథకంతో రైతు రాజుగా బతుకుతున్నాడు. రైతుల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– కేశబోయిన శ్రీశైలం, రైతు, ఆత్మకూర్.ఎస్
ఎరువుల కోసం ఎన్నో గంటలు నిరీక్షించేది
ఇదివరకు ఎరువుల కోసం షాపుల ముందు గంటల కొద్దీ నిరీక్షించేది. క్యూలో నిలబడే ఓపిక లేక చెప్పులను లైన్లో పెట్టేది. కానీ.. ఇప్పుడు సీఎం కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనన్ని ఎరువులను సప్లయ్ చేస్తున్నారు. మేము ఇప్పుడు దుకాణాలకు వెళ్లి ఎరువులను వెంటనే కొనుక్కొని ఇంటికి వెళ్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం రైతులు షాపుల ముందు క్యూలో నిలబడడం నేను చూడలేదు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు అవసరమయ్యే విధంగా పాలన సాగించలేదు. ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా చేయాలన్న పట్టుదలతో పాలిస్తున్నది. రైతుల అభివృద్ధికి పాటుపడుతున్న దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే. సీఎం సార్కు మేమెప్పుడూ రుణపడి ఉంటాం.
– గంట ముసలయ్య, రైతు, కుక్కడం, మాడ్గులపల్లి మండలం
ఎరువులు సులభంగా దొరుకుతున్నాయి
వ్యవసాయ పనుల ప్రారంభ దశలో ఎరువుల అవసరం ఎక్కువగా ఉంటుంది. గత కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం పాస్పుస్తకాలు పట్టుకొని ఫర్టిలైజర్ దుకాణాల వద్ద రోజుల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. ఇప్పుడు పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. సహకార సంఘంతోపాటు అన్ని ఎరువుల దుకాణాల్లో అవసరమైనన్ని మందు బస్తాలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు సకాలంలో రైతుబంధు వేయడంతో ఆ డబ్బుతో ఎరువులను కొనుగోలు చేస్తున్నాం.
– జెర్రిపోతుల గిరిబాబు, రైతు, వేములపల్లి
పోలీసుల పర్యవేక్షణలో ఎరువులు అమ్మేది
తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎరువుల కొరత బాగా ఉండేది. మా షాపుల్లోకి ఎరువులు రాగానే రైతులు గుంపులుగా వచ్చేది. గంటల తరబడి షాపుల ముందు క్యూ కట్టి నిలబడేది. పోలీసుల పర్యవేక్షణలో ఎరువులు అమ్మేవాళ్లం. మేము కూడా ఎరువుల కోసం డీడీలు తీసి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎరువుల కొరత ఏర్పడడం లేదు. కొన్ని కంపెనీల వాళ్లు డీడీలు పంపకముందే ఎరువులను సరఫరా చేస్తున్నారు. రైతులు ఎప్పుడంటే అప్పుడొచ్చి ఎరువులు, విత్తనాలు కొనుక్కొని పోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా ఎరువులు సరఫరా చేస్తుండడంతో ఇటు మాకు, ఆటు రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేవు.
– కాకులారపు బొర్రారెడ్డి, ఎరువుల దుకాణ యజమాని, చిట్యాల