హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమల్లో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఫలితంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. సర్కార్ జూనియర్ కాలేజీల్లో చదివి, ఎప్సెట్లో పదివేలలోపు ర్యాంకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల మొత్తం ఫీజు సర్కారే చెల్లించాల్సి ఉన్నది. కానీ రెండేండ్లుగా సర్కార్ అరకొరగా చెల్లిస్తుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఫీజు రూ. లక్ష ఉండగా 2024-25, 2025-26లో కేవలం రూ. 35వేలు మాత్రమే జమ అయ్యాయి. దీంతో బీటెక్ మూడో సంవత్సరంలోని విద్యార్థులకు టెన్షన్ పట్టుకుంది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల గురించి అడిగితే కాంగ్రెస్ సర్కార్ అవి కేసీఆర్ బకాయిలంటూ బుకాయిస్తున్నది.
కానీ ఇప్పుడు బకాయి పడ్డవి కేసీఆర్వి కావు. 2024-25, 2025-26 విద్యాసంవత్సరాలకు సంబంధించినవి. అంటే కాంగ్రెస్ సర్కార్ చెల్లించాల్సినవే. పాత బకాయిలివ్వకుండా గోసపుచ్చుతున్న కాంగ్రెస్ సర్కార్.. తాము ఇవ్వాల్సినవి కూడా ఇవ్వడంలేదు. మొత్తం ఫీజు సర్కార్ భరిస్తుందన్న నమ్మకంతో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఇప్పుడేం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. పూర్తి ఫీజు మంజూరుకాకపోవడంతో ఈ విషయంపై సర్కార్కు లేఖ రాయాలని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం కోరింది. విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఫోరం నాయకులు రాహుల్ నాయక్, దుర్గాప్రసాద్, ఆదిత్య, అక్షిత, హేమంత్, ఆనంద్, రామకృష్ణ, సాయితేజ తదితరులు శుక్రవారం జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయలక్ష్మిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
సగం కూడా ఇవ్వట్లే..