పేరుకు స్థిరీకరించిన ఆయకట్టు. పంటలకు ప్రాణం పోసేందుకు కాల్వలు కూడా తవ్వారు. కానీ, పట్టించుకునే వారేరి? కాల్వల మాట అటుంచితే ప్రాజెక్టునైనా పట్టించుకున్నారా? ఫలితం.. లీకేజీలు, కాల్వల ధ్వంసంతో మూసీ ఆయకట్టు నానాటికీ కుచించుకుపోయింది. రికార్డుల నుంచి ఆయకట్టు
తగ్గుతూ పోయింది. ఇదీ ఉమ్మడి రాష్ట్రంలో మూసీ ప్రాజెక్టు కింద పరిస్థితి. స్వరాష్ట్రంలో ఆధునీకరణతో పూర్వవైభవం సంతరించుకున్న మూసీ ప్రాజెక్టు రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నది. నాలుగు దశాబ్దాల ఇక్కట్లను తొలగిస్తూ జలసిరిని పారిస్తున్నది. మూసీ ఎడమ కాల్వ పరిధిలోని చివరి భూములే ఇందుకు సాక్ష్యం.
మూసీ ఎడమ కాల్వ పరిధి 41.75 కిలోమీటర్లు కాగా, చివరనున్న దోసపహాడ్, అనాజిపురం, అనంతారం గ్రామాల్లోని 2 వేల ఆయకట్టుకు నాలుగు దశాబ్దాలుగా నీళ్లందడం లేదు. దాంతో 1981 నుంచి ఇక్కడి రైతులు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మీది దోసపహాడ్ వద్ద లిఫ్ట్పై ఆధారపడుతున్నారు. కానీ, సాగర్లో సరిపడా నీళ్లు లేని ప్రతి సీజన్లోనూ భూములు బీడు పెట్టాల్సిన దుస్థితి.ప్రస్తుతం ఎగువ కృష్ణాలో వరద లేక సాగర్ కాల్వకు నీటి విడుదల లేకపోవడంతో మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. ఈ సమస్యకు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. వెంటనే నిధులు మంజూరు చేయించి 4.75 కిలోమీటర్ల మేర పూడిన కాల్వను పునరుద్ధరింప చేసి..దోసపహాడ్, అనాజిపురం, అనంతారం గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు మూసీ నీటిని అందిస్తున్నారు. దోసపహాడ్ చెరువును సైతం నింపుతుండడంతో
రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– సూర్యాపేట, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)
నాగార్జునసాగర్లో నీళ్లుంటేనే మా పొలాలు పండేది. లేదంటే పడావే. నాకు గుర్తున్నప్పటి నుంచి ఇదే పరిస్థితి. మా ఊరుకు మూసీ నీళ్లు వస్తాయని కూడా తెల్వదు. మంత్రి జగదీశ్రెడ్డి పట్టించుకుని పాత కాల్వను తవ్వించడం వల్ల మూసీ నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు వచ్చినంకనే పొలాలు పెడుతున్నం. ఇంక దోసపహాడ్ లిఫ్ట్ నడువకున్నా మాకు ఇబ్బంది లేదు.
సూర్యాపేట, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : మూసీ చివరి ఆయకట్టు అయిన దోసపహాడ్కు చాలా ఏండ్ల తరువాత నీళ్లు చేరాయి. గత పాలకులు మూసీ డ్యామ్ను పట్టించుకోకపోవడంతో చివరి ఆయకట్టు సుమారు రెండు వేల ఎకరాలకు ఇన్నాళ్లుగా నీరందలేదు. దీంతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై లిఫ్ట్ ఏర్పాటు చేసి దోసపహాడ్ పరిసర గ్రామాలకు నీటిని అందించారు. అయితే.. ఈ సారి నాగార్జున సాగర్లో నీటి నిల్వ లేకపోవడంతో సాగు నీరు ఇవ్వలేకపోయారు. కాగా, 2014లో గెలిచిన మంత్రి జగదీశ్రెడ్డి 2015లోనే సీఎం కేసీఆర్తో మాట్లాడి రూ.20కోట్ల వ్యయంతో మూసీ డ్యామ్ ఆధునీకరణ, మరో 60 కోట్ల రూపాయలతో కాల్వకు లైనింగ్ పూర్తి చేయించారు. దీంతో నేడు మూసీ ప్రాజెక్టు జలకళను సంతరించుకోగా.. మంత్రి చొరవతో మూసీ పాత ఆయకట్టుకు సైతం సాగు నీరు అందుతున్నది. పూడుకుపోయిన కాల్వల్లో పూడిక తీసి క్లీన్ చేయడంతో దోసపహాడ్, అనాజీపురం, అనంతారం గ్రామాల పరిధిలోని దాదాపు 2వేల ఎకరాలకు మూసీ జలాలు అందుతున్నాయి.
మూసీ నది నిర్మాణ సమయంలో ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పరిధిలో పారుతున్న ఎడమ కాల్వ 41.75 కిలోమీటర్లు ఉండగా.. ఈ పరిధిలో వేలాది ఎకరాలు సాగు కావాల్సి ఉంది. అయితే.. ఉమ్మడి రాష్ట్రంలో మూసీ నదిని నాటి పాలకులు పట్టించుకోకపోవడంతో డ్యామ్ గేట్లు విరిగి చుక్క నీరు నిలువకుండా దశాబ్దాల తరబడి లీకేజీల రూపంలో వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు పోయేవి. దీంతో 25వేల ఎకరాల ఆయకట్టు క్రమంగా కుచించుకుపోతూ వచ్చి 9వేల ఎకరాలకు మించి సాగు కాలేదు. ఈ క్రమంలో 1981లో పెన్పహాడ్ మండలంలోని అనాజీపురం, అనంతారం, దోసపహాడ్ తదితర గ్రామాల పరిధిలోని 2వేల ఎకరాలను మూసీ ఆయకట్టు నుంచి తొలగించారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద దోసపహాడ్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి సదరు ఆయకట్టుకు సాగర్ నీటిని అందిస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక బోసిపోతుండగా.. సాగర్ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో దోసపహాడ్ లిఫ్ట్ ఆయకట్టు దాదాపు 2వేల ఎకరాల్లో చాలా వరకు సాగుకు నోచుకోలేదు. అయితే.. మంత్రి జగదీశ్రెడ్డి 15రోజుల క్రితం ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మూసీ నీరు వృథాగా పోతున్నది.. ఏమైనా ఆయకట్టు పెంచుకోవచ్చా..? అని అధికారులతో చర్చించారు. ప్రస్తుతం వెళ్తున్న కాల్వలను పొడిగించే అంశాన్ని కూడా చర్చించారు. సూర్యాపేట జిల్లాలో మూసీ ఎడమ కాల్వ 41.75 కిలోమీటర్లు ఉండగా.. 37 కిలోమీటర్ల వరకే నీరు వెళ్తుందని అధికారులు చెప్పడంతో వెంటనే కాల్వలను పునరుద్ధరించాలని మంత్రి ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయించడంతో ఇరిగేషన్ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. ఐదారు రోజుల్లోనే కాల్వ పూడికతీత, జంగిల్ కటింగ్ పూర్తి చేయడంతో నేడు 41.75 కిలోమీటర్ల వరకు నీరు పారుతున్నది. దీంతో మూసీ చివరి ఆయకట్టుకు సుమారు 42 ఏండ్ల తర్వాత మూసీ జలాలు వచ్చినట్లయింది. సాగర్ ఎడమ కాల్వపై ఏర్పాటు చేసిన లిఫ్ట్కు నీళ్లు రాకపోయినా మూసీ జలాలు రావడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జునసాగర్లో నీళ్లు లేకపోతే ఈ ఏడాది మా పొలం పండదనుకున్నాం. కానీ పురాతన, పడావుపడిన మూసీ కాల్వలను తీసి వారం రోజుల సంది మూసీ నీళ్లు ఇస్తుండ్రు. అసలు మా ఊరి దాకా మూసీ కాల్వలున్నయని, ఆ నీళ్లు వస్తయని ఇప్పటిదాకా మాకు తెల్వదు. ఇప్పుడు నీళ్లొచినంక తెలిసింది. ఆ నీటితో సాగు చేస్తున్నాం. మూసీ నీళ్లు తెచ్చిన మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు.
– కొండ సంజీవయ్య, రైతు, అనాజీపురం
నాకు అనాజీపురం గ్రామంలో పదెకరాల భూమి ఉన్నది. ఈ ఏడాది నాగార్జునసాగర్లో నీళ్లు లేక ఇప్పటి వరకు కాల్వలకు వదల్లేదు. లిఫ్ట్ నడవట్లేదు. బోర్లు, బావులు ఉన్నా నీళ్లు లేకపోవడంతో సాగు కష్టం అనుకున్నా. కానీ.. మంత్రి జగదీశ్రెడ్డి పుణ్యమా అని పూడుకుపోయిన కాల్వలు తీయడంతో మూసీ నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి.
– మట్టపల్లి చిన్న హనుమయ్య, రైతు, అనాజీపురం
సాగర్లో నీళ్లు లేకుంటే మా ఊరికి మూసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని గుర్తించి మూసీ నీటిని రప్పిస్తున్న మంత్రి జగదీష్రెడ్డి నిజంగా గ్రేట్. మూసీ నీటితో మా ఊర్లో సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. మంత్రి జగదీశ్రెడ్డి వచ్చిన తరువాత ఎంతో అభివృద్ధి జరిగింది.
– సామ నరేశ్రెడ్డి, రైతు, అనంతారం
మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాలతో ఐదు రోజుల్లోపే దాదాపు నాలుగు కిలోమీటర్ల కాల్వలను పూడిక తీయడం, క్లీన్ చేయడం జరిగింది. ఇప్పటికే మూసీ కాల్వకు దాదాపు 80శాతం లైనింగ్ పూర్తి కావడంతో నీటి సరఫరా చాలా మెరుగైంది. ఈ క్రమంలో కాల్వల పూడిక తీయడంతో చివరి ఆయకట్టుకు సులువుగా నీరు చేరుతుంది.