యాదగిరిగుట్ట, జూలై 19 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. గంటన్నర పాటు అర్చక బృందం శాస్ర్తోక్తంగా కల్యాణ తంతు జరిపించారు. ప్రధానాలయ వెలుపల ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజ వాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చనలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.10,19,524 ఆదాయం సమకూరింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని కొత్తగా వచ్చిన అదనపు కలెక్టర్ ఎం.భాస్కర్రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ సంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ పర్యవేక్షకుడు రాంమోహన్ ప్రసాదం అందించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడానికి రూ.5లక్షల విరాళం సమకూరింది. భూదాన్ పోచంపల్లి మండలంలోని జులూరు గ్రామానికి చెందిన వన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బొమ్మిరెడ్డి రవీందర్రెడ్డి బుధవారం కుటుంబసమేతంగా స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆలయ ముఖ మండపంలో రూ.5లక్షల నగదును ఆలయాధికారి సురేందర్రెడ్డికి అందించారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి, పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్గౌడ్, రైతు బంధు సమితి కన్వీనర్ పేరబోయిన సత్యనారాయణ ఉన్నారు.