– నిరాధార ఆరోపణలు తగదు
– పసి బాలుడిని చంపే ప్రయత్నం చేయకండి
– అభివృద్ధికి సహకరించండి
– ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13 : కొత్తగూడెం కార్పొరేషన్ డీపీఆర్ రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపుగా తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా కార్పొరేషన్ చేస్తే ఓర్వలేక పోతున్నారన్నారు. తమ పార్టీ అభ్యర్థి తొలిసారి మేయర్ అయ్యారని, ఇప్పుడే పాలన గాడిలో పడుతుందని పసి బాలుడిపై ప్రతాపం చూపిస్తారా అని ఆయన విమర్శించారు. నిరాధార ఆరోపణలు చేయకూడదని, అలా చేసేవారిని విడిచిపెట్టమని హెచ్చరించారు. తమ పార్టీ ఎదుగుదలను చూసి కొంతమంది తట్టుకోలేక రాక్షసంగా వ్యవహరిస్తున్నారని దుర్మార్గమైన విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. డీపీఆర్ పేరుతో కుంభకోణాలు జరిగాయని విమర్శలు చేస్తున్నారని, తమ పార్టీ ఎక్కడా అవినీతికి తావివ్వదన్నారు. తమ పార్టీ చందాలు వసూలు చేయదని, కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే చందాలు వసూలు చేసి పక్కా రసీదులు ఇస్తామని తెలిపారు.
కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి రూ.600 కోట్లు నిధులు ప్రతిపాదనలు చేశామని అందులో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో 1.6 1.7 పర్సంటేజీలు డిపిఆర్ కు ఇవ్వటం జరుగుతుందని. అవి ఎవరి జేబులోకి వెళ్లేవి కావన్నారు. అందుకే విమర్శలను కూడా ఛాలెంజ్గా తీసుకుని డీపీఆర్ను ఆన్లైన్ టెండర్ వేయడం జరుగుతుంది.. కానీ అభివృద్ధిని మాత్రం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ తరఫున కార్పొరేటర్ గాని, ఇతర నాయకులు గాని అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఇంటి నంబర్ల పేరుతో ఎవరు ఒక్క రూపాయి కూడా తీసుకునే వీలు లేదన్నారు. ఎవరు తీసుకున్నట్లు తన దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ సుజాత, మేయర్ గణేష్, సిపిఐ జిల్లా సెక్రెటరీ షాబీర్ పాషా, సిపిఐ కార్పొరేటర్లు పాల్గొన్నారు.