ప్రస్తుత వానకాలం సీజన్లో వివిధ పంటలు సాగు చేసిన రైతాంగానికి యూరియా సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు ఈ సీజన్లో కావాల్సిన యూరియాలో 90శాతానికి పైగా సరఫరా చేయగా రైతుల డిమాండ్ మేరకు మరింత తెప్పిస్తున్నది. పది రోజులుగా జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు కలెక్టర్లు, అధికారులతో సమీక్షిస్తూ యూరియా కొరత లేకుండా చూస్తున్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో యూరియా వినియోగం పెరుగడంతోనే కొరత ప్రభావం ఏర్పడింది. ఈ సీజన్లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు 1.35 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు 1.16 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా జరిగింది. ఇక మార్క్ఫెడ్తోపాటు పీఏసీఎస్లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాల్లో 7వేల మెట్రిక్ టన్నులకుపైగా బఫర్ స్టాక్ ఉండగా సోమవారం 1,600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఈ వారంలో మరో నాలుగు ర్యాకులు రానున్నాయి. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దని, మోతాదుకు మించి యూరియా వినియోగిస్తే చీడపీడల సమస్య ఎక్కువ అవుతుందని వ్యవసాయ
అధికారులు సూచిస్తున్నారు.
– నల్లగొండ, సెప్టెంబర్ 11
నల్లగొండ, సెప్టెంబర్ 11: నల్లగొండ, మిర్యాలగూడ, కొండమల్లేపల్లి, నకిరేకల్, నార్కట్పల్లి పట్టణాల బస్టాండ్ నుంచి హైదరాబాద్కు ప్రైవేటు వాహనాల్లో జరిగే అక్రమ రవాణాను అరికట్టే విధంగా పోలీస్, ఆర్టీఓ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. టీఎస్ఆర్టీసీ అధికారుల విన్నపం మేరకు ఆయన సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కనీసం రెండు కిలో మీటర్ల పరిధి లోపల ప్రైవేటు వాహనాలు, సొంత, ఎల్లో ప్లేట్ వాహనాలు నిలుపకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాటిల్లో మనుషుల రవాణాతో పాటు వస్తువుల రవాణా అక్రమం గా జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే కాంట్రాక్ట్ క్యారేజీని స్టేజీ క్యారేజీగా నడపకుండా చూడాలన్నారు. పోలీస్, ఆర్టీఓ విభాగాలు ఆర్టీసీకి చేయూత ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆయా డిపోల పరిధిలో సీజ్ చేసిన 105 వాహనాలను వేలం వేయాలని ఆర్టీఓ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి, ఆర్టీఓ సురేశ్ రెడ్డి, డీఎస్పీ సైదా, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం శివ శంకర్ పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడే పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఆయ న సోమవారం గ్రీవెన్స్ డేలో భాగంగా పలువురు బాధితుల నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. గ్రీవెన్స్లో వచ్చి న ఫిర్యాదులను అధికారులు క్షుణ్ణం గా పరిశీలించి కింది స్థాయి అధికారుల ను పురమాయించి పరిష్కరించే విధ ంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా వాణిలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నల్లగొండ, సెప్టెంబర్ 11 : ప్రతి సీజన్లో వ్యవసాయ శాఖ ముందస్తుగా రూపొందించే ప్రణాళికను బట్టే ఎరువులకు సంబంధించిన రిక్వైర్మెంట్ను ప్రభుత్వానికి నివేదిస్తుంది. అందులో భాగంగానే ఈ సీజన్కుగాను నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 1.35 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. స్థానిక యంత్రాంగం రిక్వైర్మెంట్ ఆధారంగా ఇప్పటికే 1.16 లక్షల (85శాతం) మెట్రిక్ టన్నుల యూరియాను అందజేసింది. ఈ సెప్టెంబర్ చివరి నాటికి మరో 19వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తే సరిపోతున్నప్పటికీ ప్రస్తుత డిమాండ్ను బట్టి మరో 20వేల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చే పనిలో వ్యవసాయ యంత్రాంగం నిమగ్నమైంది. అయితే.. సోమవారం సాయంత్రానికి రెండు జిల్లాల్లో కలిపి ఇంకా 7300 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ మార్క్ఫెడ్తోపాటు పీఏసీఎస్లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో నిల్వ ఉన్నట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం చెప్తున్నది. మరో వారం రోజుల్లో నాలుగు నుంచి ఐదు ర్యాక్ల యూరియా జిల్లాకు రానున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా సీజన్లో సాగును దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ఎరువులను అందుబాటులో ఉంచుతున్నది. ఈ సీజన్లోనూ అదే తరహాలో ఏర్పాట్లు చేసినప్పటికీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కొరత ఏర్పడినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. వాస్తవంగా గత సీజన్లో జిల్లా వ్యాప్తంగా 17.49 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా.. ఈ సీజన్లో వర్షాభావ పరిస్థితులతో 16.39 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. అంటే గత ఏడాది సాగు అంచనాకు పది శాతం అదనంగా సాగవుతుందని అంచనా వేశారు. ఆ మేరకు యూరియా రిక్వైర్మెంట్ పెట్టగా.. వర్షాభావ పరిస్థితులతో అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. వరి పంటలో ప్రస్తుతం రెండో దఫాగా యూరియా చల్లుతుండగా పత్తిలోనూ యూరియా వినియోగిస్తున్నారు. అయితే.. ఈ రెండు పంటల్లోనూ ఇప్పటికే యూరియా వేసినప్పటికీ సరిపడా నీరు లేనందున పంటల్లో పచ్చదనం లోపించింది. ప్రధానంగా పత్తిలో ఈ సమస్య ఉండగా.. రైతులు ప్రస్తుతం కాంప్లెక్స్ ఎరువులతోపాటు యూరియా వేస్తున్నారు. ఇంతకుముందే వేసినప్పటికీ చేను పచ్చదనం లేకపోవడం, ఇటీవల కురిసిన వర్షాలకు గతంలో వేసిన ఎరువులు పని చేయలేదని మోతాదుకు మించి వేయడం వల్ల ఈ కొరత వస్తుంది.
యూరియా వినియోగం మోతాదుకు మించి పెరిగితే చీడపీడల సమస్య ఉత్పన్నమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. సాధారణంగా వరి నాటిన దగ్గర నుంచి కోసే వరకు సీజన్ ఆసాంతం ఎకరానికి 1.75 బ్యాగులు, పత్తికి 3.5 బ్యాగులు వేయాల్సి ఉంటుంది. అయితే.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చేను పచ్చగా ఉండాలని వరికి మూడు నుంచి నాలుగు బ్యాగులు, పత్తికి ఐదు బస్తాలు వేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. కాంప్లెక్స్ ఎరువులకు బదులు యూరియా ఎక్కువగా వాడితే చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నదని, మోతాదుకు మించి వాడొద్దని రైతులకు సూచిస్తున్నారు. ఇక యూరియాలో ప్రస్తుతం సన్న, దొడ్డు రకం వస్తుండగా.. కొందరు రైతులు దొడ్డు రకం యూరియా కావాలని అంటున్నారు. అయితే రెండింటిలోనూ నత్రజని 46శాతమే ఉంటున్నందున ఏదైనా సమానమేనని అధికారులు
అంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో యూరియాకు డిమాండ్ పెరుగడంతో కొరత రావద్దనే ఆలోచనతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లతో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు సమీక్షిస్తున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి రెండు సార్లు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడి రిక్వైర్మెంట్కు మించి యూరియాను తెప్పించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లాకు 1600 మెట్రిక్ టన్నుల యూరియా రాగా.. ఈ వారంలో మరో నాలుగైదు ర్యాకులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.
ఈ సారి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రధానంగా పత్తి చేలు పచ్చగా లేకండాపోయాయి. వరిలోనూ నీటి పరిమాణం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. దాంతో చేలు పచ్చగా ఉండాలని రైతులు అవసరానికి మించి యూరియాను వాడుతున్నారు. ధర తక్కువగా ఉన్నందున కాంప్లెక్స్ ఎరువుల స్థానంలో యూరియా వేయడం సరికాదు. యూరియా ఎక్కువ వాడడం వల్ల చీడపీడలు ఎక్కువై పంట దెబ్బతినే అవకాశం ఉన్నది. వాటి నివారణ కోసం క్రిమిసంహారక మందుల పేరుతో అదనపు ఖర్చు అవుతున్నందున మోతాదుకు మించి యూరియాను వాడొద్దు. ప్రస్తుతం నల్లగొండలో యూరియా స్టాక్ 4వేల మెట్రిక్ టన్నులు ఉండగా.. ఈ వారంలో మరికొన్ని ర్యాకులు రానున్నాయి. యూరియాను అవసరానికి మించి కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దు.
– శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ
సూర్యాపేట, సెప్టెంబర్ 11 : జిల్లాకు 1900 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యిందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. యూరియాపై కలెక్టరేట్లోని సమవేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా యూరియా నిల్వలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాకు వచ్చిన 1900 మెట్రిక్ టన్నుల యూరియాను 55 సొసైటీలకు పంపించినట్లు తెలిపారు. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదన్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో మాట్లాడారని, జిల్లాకు అవసరమైన యూరియాను సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. సమావేశంలో డీఏఓ రామారావునాయక్, డీసీఓ శ్రీధర్, మార్క్ఫెడ్ డీఎం జ్యోతి పాల్గొన్నారు.