రామగిరి, జూన్ 19 : పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ను నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ బుక్ స్టాల్స్, స్కూల్స్ విచ్చలవిడిగా విద్యార్థుల వద్ద అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారని, విద్యాధికారులు, పాలక యంత్రాంగం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుందని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పోలె పవన్ డిమాండ్ చేశారు. పీడీఎస్యూ నల్లగొండ నగర కమిటీ సమావేశం ఐ.లోకేష్ అధ్యక్షతన శుక్రవారం నల్లగొండలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా కేంద్రం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డాగా మారిందన్నారు. వేలకు వేలు డొనేషన్ ఫీజులు వసూళ్లు చేస్తూనే మరోవైపు టీసీ ఇవ్వడానికి రూ.1500 నుండి రూ.3 వేలు, అడ్మిన్ ఫీజు రూ.3 వేలతో పాటు పుస్తకాలకు నర్సరీ నుండి పదవ తరగతి వరకు రూ.5 వేల నుండి రూ.15 వేల వరకు అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం దండుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు.
ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. చర్యలు తీసుకోకుండా జిల్లాలో అధికార యంత్రాంగం మొద్దు నిద్రలో ఉన్నదని ఏద్దేవా చేశారు. కామన్ ఫీజులతో పాటు డ్రెస్స్, షూష్, టై, బెల్ట్ తదితర వస్తువులు విద్యా సంస్థలలో విక్రయిస్తున్నారన్నారు. కొన్ని పాఠశాలలు ప్రైవేట్ బుక్ స్టాల్స్ కు కమీషన్ పద్దతిలో పుస్తకాలు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థులను ముక్కు పిండి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. వెంటనే పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు అమ్మే పాఠశాలలను, బుక్ స్టాల్స్ ను గుర్తించి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు ఐ.లోకేష్, శంకర్, డి.వెంకటేష్, రణదీప్, సురేష్ కుమార్, ధీరజ్ కుమార్, ప్రభు, మధు సుధన్, రాజు పాల్గొన్నారు.