భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 30 : బంగారు నగల కోసం ఒంటరి మహిళను హత్య చేసిన వ్యక్తికి భువనగిరి జిల్లా కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగారశిక్షతో పాటు, రూ.2వేల జరిమానా విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016మే మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో కిరాణాషాపు నిర్వహిస్తూ ఒంటరిగా జీవిస్తున్న మహిళను నిందితుడు బాషపాక బాబు కిరాతకంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను ఎత్తుకెళ్లాడు. అప్పటి రామన్నపేట సీఐ ఎం. శ్రీధర్రెడ్డి కేసు దర్యాప్తు చేశారు.
నిందితుడైన బాషపాక బాబును అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. కేసు సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో బాబుకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ భువనగిరి మొదటి జిల్లా అదనపు జడ్జి మారుతీదేవి తీర్పు చెప్పారు.