హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : సీజేపీ, ఇతర యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల తలపెట్టిన చలో పార్లమెంట్ సందర్భంగా జెన్ జీ ఉద్యమకారులపై లాఠీలు ఝులిపించడం, పెల్లెట్లను ప్రయోగించడం దారుణమని, ఈ విషయంలో యువతకు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్షా క్షమాపణలు చెప్పాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతితో కలిసి రాఘవులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కాకుండా, ప్రతిపక్షాల ఎంపీలను చీల్చి గత సమావేశాల్లో వీగిపోయిన బిల్లులను ఆమోదించేందుకు పార్లమెంట్ సమావేశాలు పెట్టినట్టు ఉన్నదని విమర్శించారు.
జెన్ జీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను క్షమిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించడం విద్యార్థుల పోరాటాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. డీలిమిటేషన్, మహిళా బిల్లును కలిపి పెట్టినందునే ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించాయని, మహిళా బిల్లును విడిగా పెడితే మద్దతు తెలిపేవని స్పష్టంచేశారు. కేంద్ర అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న తలపెట్టిన జైల్భరోకు మద్దతిస్తున్నట్టు చెప్పారు. బీహార్లోని బాంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ గెలుపు బీజేపీకి చెంపపెట్టు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటాలకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.