నల్లగొండ, జూలై 29 : వైద్య ఆరోగ్య శాఖాధికారులు నిత్యం అందుబాటులో ఉండి పేదలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణణ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య శాఖాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలోని సబ్ సెంటర్లలో పెండింగ్ పనులు మానిటరింగ్కు నోడల్ అధికారిని నియమించాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. ఏరియా ఆస్పత్రుల్లో గైనకాలజిస్టులను నియమించి డెలివరీలు పెంచాలని సూచించారు. అంగన్వాడీల్లో పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి పునరావాస కేంద్రానికి పంపించాలన్నారు. ఏఏ అస్పత్రుల్లో ఎంత మందిని ఓపీ చూస్తున్నారనేది నివేదిక పంపాలన్నారు. అంబులెన్సులు ఎలా పనిచేస్తున్నది నివేదిక ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులపై మానిటరింగ్ చేస్తూ గర్భస్త, బ్రూణ హత్యలు జరగకుండా వైద్యాధికారులు తగు చర్యలు తీసుకుంటూ మానిటరింగ్ చేయాలన్నారు.
జిల్లా ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ
నీలగిరి : రోగులకు సరిపడా మందులు అందుబాటులో ఉం చాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణణ్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులు కలియతిరిగి పరిశీలించి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ముం దుగా ఎమర్జెన్సీ వార్డును సందర్శించాక పాలియేటివ్ కేర్ విభాగాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. ‘మందులు ఇస్తున్నారా.. ఎన్ని రోజుల నుం చి ఉన్నారు.. యూనిట్ డాక్టర్ ఎవరు వస్తున్నారని’ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎంతమంది క్యాన్సర్ రోగులు ఉన్నారు.. అందులో మన యూనిట్ నుంచి ఎంత మందికి చికిత్స అందిస్తున్నారని సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో క్యాన్సర్, దీర్ఘకాలిక రోగుల వివరాలు పీహెచ్సీల వారీగా తనకు అందించాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. డయాలసిస్ వార్డును సందర్శించి రోగులతో మాట్లాడి మందులు ఇస్తున్నారా.. ఎక్కడ తీసుకుంటున్నారని అడగ్గా బయట నుంచి తెచ్చుకుంటున్నట్లు రోగులు ఆయన దృష్టికి తేగా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రోగులకు సరిపడా మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం మేల్ మెడికల్ వార్డు, ఎంసీహెచ్లోని లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించి ప్రసూ తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీలతో పాటు ఏరియా ఆస్పత్రికి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ కొండల్రావు, డీసీహెచ్ఎస్ మాతృ, ఆస్పత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, రాధాకృష్ణ, సిబ్బంది ఉన్నారు.