ఉమ్మడి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 428 మంది అభ్యర్థులు 745 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం విశేషం. అత్యధికంగా మునుగోడులో 51 మంది అభ్యర్థులు, అతి తక్కువగా దేవరకొండ నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. నేడు, రేపు ప్రభుత్వ సెలవు దినం కావడంతో సోమవారం నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. బరిలో నుంచి తప్పుకోవాలనుకుంటున్న వారికి ఈ నెల 15 వరకు ఉపసంహరణ గడువు ఉన్నది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా వెల్లడికానున్నది. ఇక ఇప్పటి నుంచి ప్రచారం మరింత ఊపందుకోనున్నది.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకుంటున్నది. ఈ నెల 3న నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా శుక్రవారంతో ముగిసింది. 5వ తేదీ ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ సారి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల సంఖ్యతోపాటు వారు దాఖలు చేసిన నామినేషన్ల సెట్ల సంఖ్య కూడా భారీగా ఉన్నది. మొత్తం 425 మంది అభ్యర్థులు 745 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గతంలో ఏ ఎన్నికల్లోనూ ఇన్ని నామినేషన్లు దాఖలైన సందర్భాలు లేవు. ఈ సారి రికార్డు స్థాయిలో నామినేషన్లు వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు.
చివరి రోజు శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పేరుతో ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు నామినేషన్లు వేశారు. చివరి రోజు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా సూర్యాపేటలో సీనియర్ నేత పటేల్ రమేశ్రెడ్డి, ఆలేరులో మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేశ్, మిర్యాలగూడలో పీసీసీ మాజీ సభ్యుడు పగిడి రామలింగయ్య యాదవ్ నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. నకిరేకల్లో దైద రవీందర్, తుంగతుర్తిలో మోత్కుపల్లి నర్సింహులు, కొండేటి మల్లయ్య, వడ్డేపల్లి రవికుమార్, భాషపంగు భాస్కర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో నామినేషన్లు వేసి ఉన్నారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ ఆది నుంచీ చాలా స్పష్టతతో ముందుకు సాగుతున్నది. ఆగస్టు 21న ప్రకటించిన పార్టీ అభ్యర్థులంతా భీ ఫామ్లు జతపర్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కడా గందరగోళం లేకుండా చాలా క్రమశిక్షణతో బీఆర్ఎస్ అభ్యర్థులు, నేతలంతా వ్యవహరించి తమ ప్రత్యేకతను చాటుకోవడం విశేషం.
దాఖలైన నామినేషన్ పత్రాలన్నీ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉన్నాయో, లేదోనని ఈ నెల 13న పరిశీలన చేపట్టనున్నారు. అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో దీన్ని నిర్వహించనున్నారు. పరిశీలన అనంతరం మిగిలిన అభ్యర్థుల్లో ఎవరైనా బరిలో నుంచి తప్పుకోవాలనుకుంటే ఈ నెల 15వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉన్నది. అదే రోజు మధ్యాహ్నం 3గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులతో తుది జాబితాను వెల్లడిస్తారు. తుది జాబితాలోని క్రమ సంఖ్య ప్రకారం ఈవీఎం బ్యాలెట్లో అభ్యర్థుల పేర్లు, గుర్తులు పొందుపర్చనున్నారు.